హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు అందితే చాలు వెంటనే రంగంలోకి దిగుతుంది. ముందుగా అధికారులు ఫిర్యాదు అందిన ప్రాంతాలకు వెళ్లి.. పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆక్రమణకు గురైనట్లు వారి దృష్టికి వస్తే చాలు.. నోటీసులు ఇచ్చి.. వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. గత మూడు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో తాజాగా నేడు హైడ్రా జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలపై దృష్టి సారించింది. నాలాను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. ఆ వివరాలు..
జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 41 పెద్దమ్మగుడి సమీపంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఉదయం ఆరు గంటల నుంచి కూల్చివేతలు కొనసాగాయి. నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు,షెడ్లను అధికారులు కూల్చివేశారు. అంతేకాక నాలాతో పాటు పార్కు రహదారిని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూడా తొలగించారు. దీంతో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కుకు దారి లభించింది. ఈ ఆక్రమణల గురించి హైడ్రాకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగింది.
ఓ కిరాయిదారుడు నాలాతో పాటు పార్కు రహదారిని ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించాడు. యాజమానికి తెలియకుండానే ఇదంతా చేశాడు. అంతేకాక రోడ్డు, నాలాను ఆక్రమించి హోటళ్లు, హాస్టల్ నడుపుతూ.. నెలకు రూ. 10 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నాడు. అయితే ఈ కిరాయిదారుడి వ్యవహారంపై గతంలోనే హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారించిన హైడ్రా.. కొన్నాళ్ల క్రితమే సదరు కిరాయిదారుడికి నోటీసులు జారీ చేసింది.
అయితే అతడు ఈ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. కానీ కిరాయిదారుడికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ నిర్మాణాలపై కిరాయిదారుడుకి ఎలాంటి హక్కు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. పైగా రోడ్డు, నాలాను ఆక్రమించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఈసందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
కోర్టు ఉత్తర్వులతో హైడ్రా రంగంలోకి దిగింది. నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శుక్రవారం తొలగించింది. ఆక్రమణల తొలగింపుతో.. అక్కడే ఉన్న దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలోని పార్క్కి దారికి లైన్ క్లియర్ అయిందని హైడ్రా వివరించింది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బుధ, గురువారాల్లో (మే 21, 22) మేడిపల్లి, ఫిర్జాదిగూడ పరిధిలో ఆక్రమణలు కూల్చేసిన హైడ్రా.. తాజాగా శుక్రవారం (మే 23) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఆక్రమణలపై దృష్టి సారించింది. మేడిపల్లి పరిధిలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో గురువారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కంచ పర్వతాపూర్ గ్రామం శ్మశాన వాటికలో వెలిసిన అక్రమ లే ఔట్ను, కట్టడాలను తొలగించింది.
![]() |
![]() |