ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము అడుక్కునే స్థితిలో ఉన్నామని వాళ్లు అనుకోవడం లేదు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 10:40 PM

గత కొన్నేళ్లుగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న దాయాది పాకిస్థాన్.. సాయం కోసం ప్రపంచ దేశాలను అర్ధిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూ.8 వేల కోట్ల ప్యాకేజీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమ దేశ ఆర్థిక పరిస్థితిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రదేశాలతో తమ సంబంధాలు బలోపేతమయ్యాయని, ఇకపై మేము యాచించే స్థితిలో ఉన్నామని అవి భావించడం లేదని వ్యాఖ్యానించారు. బలూచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని కమాండ్‌ అండ్‌ స్టాఫ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొని ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిత్ర దేశాలు ముఖ్యంగా చైనా, అజర్‌బైజాన్, సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీలతో పాక్ బలమైన సంబంధాలను కొనసాగిస్తుందని అన్నారు. అయితే, ఈ దేశాలు ఇక పాకిస్థాన్‌ను ‘భిక్షపాత్ర’తో తమ వద్దకు వస్తుందని చూడడం లేదని స్పష్టం చేశారు. ‘ఇప్పుడు వారు మమ్మల్ని వాణిజ్యం, పరిశోధన, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నారు.. ఇక మనం చేతులు చాచి యాచనకు రావాలని వారు అనుకోవడం లేదు’ అని షరీఫ్ పేర్కొన్నారు.


తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ రుణ ప్రతిపాదనలను భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ‘ఈ నిధులు సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు దోహదపడే ప్రమాదం ఉంది’ అంటూ భారత ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. కాగా, 1958 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌కు 25 సార్లు రుణ సహాయం చేయడం గమనార్హం.


షెహ్‌బాజ్ తన ప్రసంగంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గురించి కూడా ప్రస్తావించారు. దేశ ఆర్థిక భారాన్ని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌‌తో పాటు మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశ భవితవ్యాన్ని గౌరవప్రదంగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందని ఆయన ఉద్ఘాటించారు.


ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌తో నెలకున్న ఉద్రిక్తతలపై షెహబాజ్ మాట్లాడుతూ.. భారత బ్రహ్మోస్ క్షిపణి దాడులు పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలను అతలాకుతలం చేశాయని తెలిపారు. మే 9-10 రాత్రి భారత వైమానిక దళాలు రావల్పిండిలోని ఎయిర్‌పోర్టు, ఇతర ప్రావిన్సులపై దాడులు జరిపినట్టు చెప్పారు.


‘మేము తెల్లవారుజామున నిద్రలేచి స్పందించేలోపు భారత్ మరోసారి బ్రహ్మోస్ క్షిపణులతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆజర్‌బైజాన్‌ పర్యటనలో షెహబాజ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో తమ దేశానికి జరిగిన నష్టం గురించి పాక్ ప్రధాని బహిరంగంగా అంగీకరించడం రెండోసారి. గత నెలలోనూ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సహా పలు స్థలాలు భారత దాడుల్లో నాశనమయ్యాయని ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa