ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట నిలబెట్టుకోకుండానే చనిపోయిన కెప్టెన్ సుమిత్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 08:52 PM

అహ్మదాబాద్‌లో గురువారం రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అనేక మందిని అనాథలను చేసింది. ప్రమాదం సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది సిబ్బంది ఉండగా.. ఇందులో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారంతా చనిపోయియారు. అయితే మృతుల్లోనే ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమిత్ ఉండగా.. అతడి కథ ఇప్పుడు యావత్ సమాజాన్ని కన్నీళ్లు పెట్టిప్సోతంది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తండ్రికి ఇటీవలే ఓ మాట ఇచ్చారు. పైలట్ ఉద్యోగం మానేసి వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను నాన్నా అని చెప్పారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో మృతి చెంది.. వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.


కెప్టెన్ సుమిత్ సభర్వాల్‌కు 8,200 గంటల సుదీర్ఘ పైలెట్ అనుభవం ఉంది. ఆయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా 1,100 గంటల అనుభవంతో కలిపి, మొత్తం 9,300 గంటల అనుభవం ఉన్న పైలెట్లు ఈ విమానాన్ని నడిపారు. అయితే గురువారం రోజు మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన ఈ విమానం.. కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ప్రమాదానికి ముందు కెప్టెన్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు "మేడే" కాల్ చేసి, విమానం అదుపు తప్పినట్లు సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత కాసేపట్లోనే విమానం కూలిపోయింది. ఇలా ఒక్క వ్యక్తి తప్ప విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.


ప్రతి పైలెట్‌కు ఆకాశమే ప్రపంచం. సుమీత్‌కు కూడా తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం. కానీ తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం, అందులోనూ ఆయన ఒంటరిగా ఉండడంతో.. ఉద్యోగం కంటే కన్నతండ్రికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చివరి దశలోకి చేరి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం తనకెంతో ఇష్టమైన పైలెట్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పారు. త్వరలోనే పైలెట్ ఉద్యోగం మానేసి వచ్చేస్తాను, మిమ్మల్ని చూసుకుంటాను నాన్న అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి పొంగిపోయాడు. కుమారుడికి తనపై ఉన్న ప్రేమను చూసి లోలోపలే మురిసిపోయాడు.


కానీ విధి వక్రించడంతో.. కెప్టెన్ సుమిత్ ప్రాణాలు కోల్పోయాడు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకముందే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ముంబైలోని పోవై ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న తండ్రి.. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. తానే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే కెప్టెన్ సుమిత్ తండ్రి కూడా గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో విధులు నిర్వహించారు. చాలా రోజుల క్రితమే పదవీ విరమణ కూడా పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa