ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ కింగ్ చార్లెస్ 3ని కలిసిన టీమిండియా ప్లేయర్లు

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 10:33 PM

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త పురుష‌ల‌, మ‌హిళ‌ల క్రికెట్‌ జ‌ట్ల ప్లేయ‌ర్లు బ్రిట‌న్ కింగ్ చార్లెస్ 3ను క‌లిశారు. మంగళవారం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌ను శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని పురుషుల జట్టు.. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉన్న మహిళల జట్టు, ఇరు జట్ల హెడ్‌ కోచ్‌లు గౌతమ్‌ గంభీర్‌, ముజుందార్‌లు సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో ఆటగాళ్లకు హృదయపూర్వకంగా స్వాగ‌తం ప‌లికిన చార్లెస్ 3.. కాసేపు వారితో ముచ్చ‌టించారు. ప్ర‌తీ ఒక్కరితో క‌ర‌చాల‌నం చేస్తూ న‌వ్వుతూ ప‌ల‌క‌రించారు.


భారత జట్టులోని జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌ తదితర ఆటగాళ్లతో చార్లెస్ 3 మాట్లాడారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్ హైలైట్స్ తాను చూశానని.. ఈ సందర్బంగా కింగ్ చార్లెస్ భారత ప్లేయర్లతో అన్నారు. అనంతరం పురుషులు, మహిళల జట్లతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్లేయ‌ర్లు, కోచింగ్ స్టాప్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్‌ చార్లెస్ 3ను క‌లిశారు.


కింగ్ చార్లెస్‌ను కలిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడాడు. “కింగ్ చార్లెస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎంతో అప్యాయ‌త‌గా ప‌ల‌కరించారు. మేము చాలా విష‌యాలు ఆయ‌న‌తో చర్చించాం. లార్డ్స్‌ టెస్టులో మహమ్మద్‌ సిరాజ్‌ ఔటైన విధానం చాలా దురదృష్టకరమని, బంతి పక్క నుంచి వెళ్లి స్టంప్స్‌ని తాకిందని ఆయన మాతో అన్నారు. మాకు ఈ మ్యాచ్‌లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పా” శుభ్‌మన్ గిల్ అన్నాడు. కాగా లార్డ్స్ టెస్ట్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టు జులై 23 నుంచి జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa