ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడంపై పశ్చిమ దేశాల నుంచి వస్తున్న విమర్శలకు బ్రిటన్కు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీనిపై నిలదీసిన వారికి దొరైస్వామి ఘాటుగా బదులిచ్చారు.
భారత్కు ఉన్న అపారమైన ఇంధన అవసరాలను, సంప్రదాయ ఇంధన మార్కెట్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ.. "మా ఆర్థిక వ్యవస్థను ఆపివేయాలా?" అని ఆయన ప్రశ్నించారు. ఇది భారత్ తన ఇంధన భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్య అని పరోక్షంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ను కోరుతున్న కొన్ని యూరోపియన్ భాగస్వామ్య దేశాలు కూడా అదే దేశాల నుంచి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని దొరైస్వామి సూటిగా ఎత్తిచూపారు. ఇది పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.
భారత్-రష్యాల సంబంధాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న భద్రతా సంబంధాలపై ఆధారపడి ఉన్నాయని దొరైస్వామి వివరించారు. పాశ్చాత్య దేశాలు భారత్కు ఆయుధాలను విక్రయించడానికి నిరాకరించిన సమయంలో కూడా రష్యా అండగా నిలిచిందని, మన పొరుగు దేశాలకు విక్రయించినప్పటికీ.. భారత్కు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఈ చారిత్రక బంధాన్ని విస్మరించలేమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా,.. "ఇది యుద్ధ యుగం కాదు" అని దొరైస్వామి పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ సంక్షోభం తక్షణమే ముగియాలని భారత్ బలంగా కోరుకుంటుందని.. శాంతి, స్థిరత్వం తిరిగి రావాలని ఆశిస్తుందని ఆయన తెలియజేశారు. రష్యా చమురు దిగుమతులపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. 1తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడమే ప్రధానమని దొరైస్వామి పరోక్షంగా తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై భారత్ తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను సమర్థించుకుంటుందని స్పష్టం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa