ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్ టీ20 లీగ్‌లోకి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.. రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడి

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 10:21 PM

క్రికెట్ ప్రపంచాన్ని ది హండ్రెడ్ టోర్నమెంట్ తన వైపు చూసేలా చేస్తోంది. కేవలం ఇంగ్లండ్‌కే పరిమితమైన ది హండ్రెడ్ లీగ్‌లోకి ఇంగ్లండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు ( ఈసీబీ ) ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్లను కూడా ఆహ్వానించింది. ఈ లీగ్‌లో నాలుగు భారతీయ ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్‌నర్లు అయ్యారని ఈసీబీ ప్రకటించింది. తాజాగా జరిగిన ఒప్పందాల ప్రకారం 2025 అక్టోబర్ 1 నుంచి ఈ నాలుగు ఫ్రాంఛైజీలు తమ జట్లపై ఆపరేషనల్ నియంత్రణ చేపట్టనున్నట్లు ఈసీబీ వివరించింది.


ఈసీబీతో తాజాగా జరిగిన ఒప్పందాల మేరకు ఇంగ్లండ్ క్రికెట్‌లో తొలిసారిగా ఫ్రాంఛైజీ యాజమాన్య మోడల్ అమలుకాబోతోంది. దీని ద్వారా 975 మిలియన్ పౌండ్లకు పైగా విలువ కలిగిన పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా.. దాదాపు 500 మిలియన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 5,300 కోట్లు వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది.


ఈ ఒప్పందాల ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు చెందిన ఆర్పీఎస్‌జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో 70 శాతం వాటా, నార్తన్ సూపర్ ఛార్జర్స్‌లో ఎస్ఆర్‌హెచ్ యజమానులు అయిన సన్ టీవీ నెట్‌వర్క్ వంద శాతం యాజమాన్యం పొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు అయిన జీఎంఆర్ గ్రూప్ 49 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇక ఓవల్ ఇన్విసిబుల్స్‌లో రియలన్స్ గ్రూప్ 49 శాతం వాటా కొనుగోలు చేసిన ఒప్పందాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది.


ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో పాటు మిగతా వాళ్లు కూడా హండ్రెడ్ లీగ్‌లోని జట్లను కొనుగోలు చేశారు. లండన్ స్పిరిట్‌లో టెక్ టైటాన్స్ 49 శాతం, బర్మింగ్‌హామ్ ఫొనెక్స్‌లో నైట్‌హెడ్ క్యాపిటల్స్ 49 శాతం, వేల్స్ ఫైర్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 49 శాతం, ట్రెంట్ రాకెట్స్‌లో సియాన్ ఇంటర్నేషనల్ అండ్ ఏరీస్ మేనేజ్‌మెంట్ 49 శాతం వాటా పొందారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందాలు కాలేదు.


క్రికెట్ పూర్తిగా వ్యాపారంగా మారడంతో భారతదేశానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20లో అడుగుపెట్టిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, తర్వాత యూఎస్ఏ టీ20 లీగ్‌లో కూడా జట్లను కొనుగోలు చేశారు. తాజాగా ఇంగ్లండ్ టీ20 లీగ్ ది హండ్రెడ్ లోనూ అడుగుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa