ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి అదృశ్యం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:09 PM

ఇటీవలే ఇండిగో విమానంలో సహ ప్రయాణికుడి చేతిలో చెంపదెబ్బ తిని పానిక్ అటాక్‌కు గురైన అస్సాం వాసి హొస్సేన్ అహ్మద్ మజుందార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత.. అతడు కనిపించకుండా పోవడం అనేక సందేహాలకు దారి తీస్తోంది.


ఈ ఘటన జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న హుస్సేన్ అహ్మద్ మజుందార్ అనూహ్యంగా తీవ్రమైన పానిక్ అటాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో ఆయనను శాంతింపజేయడానికి బదులుగా.. పక్కనే ఉన్న ఒక సహ ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అతని చెంపపై కొట్టాడు. ఈ ఘటనపై విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నప్పటికీ.. అది హొస్సేన్‌ను మరింతగా కలచివేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత హుస్సేన్ గౌహతికి వెళ్లాల్సి ఉండగా.. అతను అక్కడి నుంచి అదృశ్యం అయ్యాడు.


అయితే ఈ విషయం తెలియని అతడి కుటుంబ సభ్యులు విమానాశ్రయంలో అతడి కోసం చాలా సేపు వేచి చూశారు. ఎంతకూ రాకపోవడం.. ఆ తర్వాత కాసేపటికే అతడిని చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. హుస్సేనే అదృశ్యం అయ్యాడని ఫిర్యాదు చేశారు. హుస్సేన్‌ది అస్సాంలోని కాచార్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. ముంబయిలోని ఓ హోటల్లో పని చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు ఇదే మార్గంలో ఇంటికి వచ్చేవాడని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని హుస్సేన్ తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ పేర్కొన్నారు.


ముఖ్యంగా హుస్సేన్ మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో.. విమానంలో జరిగిన ఘటన అతనిపై తీవ్ర ప్రభావం చూపి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు అతన్ని వెతకడం కోసం ఢిల్లీ, గౌహతిలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన అధికారులు.. హుస్సేన్ ఎక్కడున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అలాగే హుస్సేన్‌ను కొట్టిన వ్యక్తిని కోల్‌కతాలో దిగిన వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు చెప్పారు. అతడు నిబంధనలకు విరుద్ధుంగా నడుచుకునే వ్యక్తిగా గుర్తించి.. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఎయిర్ లైన్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa