గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఒక మహిళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో రెండున్నర నిమిషాల వరకు ఉంది. ఆ వీడియోలో ఆడియో వినపడటం లేదు.. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.. అసలు మహిళ ఎవరు.. నసీర్ వీడియో కాల్లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. ఎమ్మెల్యే తీరుపై వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోంది. ఈ వివాదంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పందించాల్సి ఉంది.
కొన్ని నెలల క్రితం మరో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే ఈ వివాదంపై వీడియోలో ఉన్న మహిళ హైకోర్టును ఆశ్రయించారు.. అయితే ఆ వెంటనే ఆమె తన పిటిషన్ను వెనక్కు తీసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. తాజాగా మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు.
మహమ్మద్ నసీర్ టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓడిపోయారు.. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు ఇటీవల నసీర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి 2025-26కి ఉభయ సభల సంయుక్త కమిటీలలో మైనారిటీ వర్గాల సంక్షేమ కమిటీ ఛైర్మన్గా నియమించారు. వక్ఫ్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.
గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబులు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. వీరు కూడా మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా కుట్రని ఆ ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్ని కూడా అలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa