అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. చెల్లి, తమ్ముడే అక్కకు తొలి సంతానం అవుతారు. అమ్మానాన్నల తర్వాత వారి బాగోగులు చూసుకునేది అక్కే. ఇక మగ పిల్లలకు అయితే అక్కే తొలి స్నేహితురాలు. స్కూల్, కాలేజీ గొడవలు, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రతి విషయం అక్కకు చెప్పుకుంటారు. రాఖీ పండుగ వేళ అక్కతో రాఖీ కట్టించుకుని.. అక్క దగ్గరే డబ్బులు తీసుకుంటారు. పెళ్లైన తర్వాత కూడా ప్రతి విషయం అక్కతోనే చెప్పుకుంటారు. అక్కా తమ్ముడి మద్య అనుబంధం అంత ప్రత్యేకమైంది.. అపురూపమైంది కూడా. మిగతా పండగల మాట ఎలా ఉన్నా.. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను మాత్రం వారు చాలా ఘనంగా జరుపుకుంటారు.
అంతటి ప్రాధాన్యత ఉన్న రాఖీ పండుగకు మరొక్క రోజు సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 9, శనివారం నాడు రాఖీ పండుగ. పండుగకు మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండగా.. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టడం కోసం సంతోషంగా ఎదురు చూస్తోన్న ఓ అక్కకు.. తన తోబుట్టువు ఇక లేడనే చేదు వార్త తెలిసి గుండె పగిలింది. తమ్ముడి మృతదేహంపై పడి విలపిస్తూ.. ‘తమ్ముడూ.. రాఖీ కట్టడానికి వచ్చాను..ఒక్కసారి లేవరా..’ అంటూ ఏడుస్తూ.. చనిపోయిన తమ్ముడి చేతికి చివరి రాఖీ కట్టింది ఆ అక్క. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పందిరి పెద్ద లింగారెడ్డి, శారదలు వ్యవసాయ కుటుంబానికి చెందిన దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.. జ్యోతి, అప్పిరెడ్డి(24)లు ఉన్నారు. అయితే అప్పిరెడ్డి పుట్టిన కొన్ని రోజులకే అతడి తల్లి చనిపోయింది. జ్యోతికి అప్పటికి రెండేళ్ల వయసు. అప్పటి నుంచి పిల్లలకు అన్నీ తానై వారి ఆలనాపాలనా చూసుకున్నారు. జ్యోతి.. తన తమ్ముడికి అక్క మాత్రమే కాదు అమ్మయ్యింది. అతడిని కన్నబిడ్డ కన్నా ఎక్కువ ప్రేమగా పెంచి పెద్ద చేసింది. జ్యోతికి వివాహం అయ్యి అత్తారింటికి వెళ్లగా.. అప్పిరెడ్డి.. జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అప్పిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూనే బుధవారం నాడు చనిపోయాడు. అప్పటికి రాఖీ పండుగకు సమయం దగ్గర పడుతుండటంతో.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వచ్చేందుకు రెడీ అవుతోంది జ్యోతి. ఇంతలోనే ఆమెకు పిడుగులాంటి వార్త తెలిసింది. ఆస్పత్రిలో చేరిన తమ్ముడు అటు నుంచి అటే కానరాని లోకాలకు వెళ్లాడనే కబురందింది. కన్నబిడ్డలా ప్రేమగా పెంచి పెద్ద చేసిన తమ్ముడు.. జీవితాంతం తనకు తోడుగా ఉంటానని బాస చేసిన తోబుట్టువు చనిపోయాడని తెలిసిన ఆ అక్క పరుగున పుట్టింటికి చేరుకుంది. వస్తూ వస్తూ ఈ సంవత్సరం తమ్ముడికి కట్టడానికి కొన్న రాఖీని కూడా తెచ్చింది. తమ్ముడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. తమ్ముడు లేరా.. రాఖీ కడతాను.. ఇదే మనిద్దరికి చివరి రాఖీ అంటూ తమ్ముడి మృత దేహానికి రాఖీ కట్టి గుండెలు పగిలేలా విలపించింది. ఆమె బాధ చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ ఘటనతో పండుగ ముందు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa