ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుతిన్‌తో భేటీ అవుతున్నట్టు ప్రకటించిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 07:40 AM

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వచ్చే వారం సమావేశం కానున్నట్టు వెల్లడించారు. ఈ చర్చల్లో భాగంగా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరేలా కొన్ని భూభాగాలను మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో పుతిన్‌తో తాను భేటీ కానున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ భేటీ తేదీ, ప్రదేశంపై రష్యా ప్రభుత్వం  ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన దండయాత్ర కారణంగా ఉక్రెయిన్‌లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధాన్ని ఆపేందుకు గతంలో జరిగిన మూడు విడతల చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా చొరవ ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కీలక సమావేశానికి ముందు పుతిన్ మిత్రదేశాలైన చైనా, భారత అధినేతలతో సంప్రదింపులు జరిపారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలతో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని తాము స్వాగతిస్తున్నామని జిన్‌పింగ్ చెప్పినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, చర్చల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేస్తున్నారు. తనతో చర్చలు జరపకుండా శాంతి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.2021లో జెనీవాలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పుతిన్‌ మధ్య సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇరు దేశాల అధ్యక్షులు భేటీ కానుండటం ఇదే ప్రథమం. ఈ చర్చల ద్వారా మూడేళ్లకు పైగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి శాంతియుత ముగింపు లభిస్తుందో లేదోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa