ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధూ జలాలపై చర్చల ప్రసక్తేలేదు.. తేల్చిచెప్పిన మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 08:45 PM

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మోదీ దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగే క్షణాలు ఇవని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడే సమయమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. దాయాది పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. అలాగే, ఇటీవల పాకిస్థాన్ నాయకుల అణుబెదిరింపులకు మోదీ కౌంటర్ ఇచ్చారు.


‘‘మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించింది తీవ్రవాదం.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మతం పేరుతో అమాయకులపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాం.. యావత్‌ భారతావని ఆగ్రహంతో రగిలిపోయింది. దానికి బదులుగా ఆపరేషన్‌ సిందూర్‌‌ను చేపట్టి ఊహించని రీతిలో శత్రువును దెబ్బకొట్టాం.. శత్రువులపై దాడి విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.. ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో.. టార్గెట్, సమయం ఎంచుకునే నిర్ణయాన్ని అప్పగించాం..’’ అని అన్నారు.


‘‘అణ్వాయుధ బెదిరింపులకు భారత్‌ భయపడబోదనే విషయాన్ని శత్రువుకు తెలియజేశాం.. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని మళ్లీ చెబుతున్నా.. సింధూ జలాల ఒప్పందం విషయంలో ఇంకో మాట లేదు.. భారత భూభాగానికి సింధూ జలాలను మళ్లించాలన్న ఆలోచనలో మార్పు ఉండదు... నీళ్లు లేని ప్రాంతాలకు వాటిని తరలిస్తాం.. ఆ జలాలపై సర్వహక్కులు భారత్‌వి.., మన రైతులవి మాత్రమే. ఒప్పందం పునరుద్ధరణ జరిగే ప్రసక్తే లేదు... చర్చలు కూడా ఉండబోవు’ అని దాయాదికి ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అక్కడ నుంచే భారత్‌పై కవ్వింపులకు దిగిన విషయం తెలిసిందే.


తమ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడితే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పరోక్షంగా భారత్‌పై బెదిరింపులకు దిగారు. అలాగే, పాక్ రాజకీయ నేత బిలావల్ భుట్టో కూడా సింధూ జలాల విషయంలో భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా నమ్మిన భారత్.. దాయాదిపై దౌత్యపరంగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో పాక్‌కు వెళ్లాల్సిన జలాలు నిలిచిపోయి.. ఆ దేశంలో ఎడారి మాదిరి పరిస్థితులు నెలకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa