పురుషుల ఆసియాకప్ 2025 కోసం జట్టును ప్రకటించిన కాసేపటికే.. మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ మేరకు ముంబైలో సమావేశమైన బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించింది. భారత మహిళల చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్.. విలేకరుల సమావేశంలో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టు వివరాలను వెల్లడించారు. ఈ సమావేసంలో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పాల్గొంది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కి ముందు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కు సైతం భారత జట్టును ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్.. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో జరుగుతుంది. సెప్టెంబర్ 30 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోనుంది. ఇక ఈ రెండు జట్లకు హర్మన్కు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చోటు దక్కించుకున్నారు.
కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదే ఏడాదిలో టీమిండియా తరఫున డెబ్యూ చేసిన ఆమె.. మెరుగైన ప్రదర్శన చేసి వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించింది. ఇక హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డికి సైతం ఈ జట్టులో చోటు దక్కింది. మరోవైపు లేడీ సెహ్వాగ్ పేరు పొందిన షెఫాలీ వర్మకు నిరాశ ఎదురైంది. ఇటీవల ఆమె ఆశించిన మేర రాణించకపోవడం.. ఆమె ప్లేసులో ఓపెనర్గా వచ్చిన ప్రతికా రావల్ రాణిస్తుండటంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్కు భారత జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa