ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్ ఘర్షణలు.. చిక్కుకుపోయిన 240 మంది తెలుగువారు.. కాపాడతామన్న మంత్రి నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:40 PM

నేపాల్‌లో చెలరేగిన అల్లర్లలో 81 మంది ఉత్తరాంధ్ర వాసులు సహా 240 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. ఈనెల 3న విశాఖపట్నం నుంచి నేపాల్‌కి విహారయాత్రకు వెళ్లిన 81 మంది బృందం.. అక్కడ అల్లర్ల కారణంగా హోటల్‌లో చిక్కుకుపోయారు. వీరిలో 70 మంది విశాఖ వాసులు కాగా.. 11 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మండులోని రాయల్ కుసుమ్ హోటల్‌లో బిక్కుబిక్కుమంటున్న కాలం గడుపుతున్నారు. అల్లర్లతో ఖాట్మండు నగరం తగలబడిపోతుండడంతో వీరంతా తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. అయితే, వీరిని కాపడడానికి మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆయన చర్యలు చేపట్టారు. ఈ మేరకు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేశ్‌కు వివరించారు. పలువురు బాధితులతో మంత్రి వీడియోకాల్‌లో మాట్లాడారు. వారు అక్కడి పరిస్థితిని లోకేశ్‌కు వివరించారు. ఏపీ భవన్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌, రాష్ట్రానికి చెందిన సీనియర్‌ అధికారులు కార్తికేయ మిశ్రా, ముకేశ్‌కుమార్‌ మీనా, కోన శశిధర్‌, అజయ్‌ జైన్‌, హిమాన్షు శుక్లా, జయలక్ష్మితో మంత్రి సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ 81 మందితో కలిపి సుమారు 240 మంది తెలుగు వారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. గౌశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55, బఫాల్‌లో 27, సిమిల్‌కోట్‌లో 12 మంది, ఇతర ప్రాంతాల్లో మరికొంతమంది ఉన్నట్లు వెల్లడించారు. ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని రాష్ట్రానికి రప్పించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఏపీ వాసులు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాంగశాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాష్ట్ర అధికారులు మంత్రికి వివరించారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి వీడియో కాల్‌లో మాట్లాడారు. మహిళలు సూర్యప్రభ, రోజారాణి అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. ముక్తినాథ్‌ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నామని సూర్యప్రభ తెలిపారు. హోటల్‌ గది నుంచి బయటకు రావొద్దని.. ప్రతి 2 గంటలకు ఓసారి అధికారులు సంప్రదింపులు చేస్తారని లోకేశ్‌ సూచించారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్‌రావు, దామర్ల నాగలక్ష్మితో మంత్రి మాట్లాడారు. మంగళవారం తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్‌ హోటల్‌లో తమతో పాటు 40 మంది తెలుగువారు ఉన్నట్లు మంగళగిరి వాసులు లోకేశ్‌కు వివరించారు. ఖాట్మండు ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరంలో తమ హోటల్‌ ఉందన్నారు. ఆందోళన చెందవద్దని.. క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మంగళగిరివాసులతో రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు టచ్‌లో ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేశ్‌ భరోసా ఇచ్చారు. నేపాల్‌లో నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో అక్కడ ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి పెట్టిన మంత్రి నారా లోకేశ్.. నేటి అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతపురంలో నేడు నిర్వహించనున్న ‘సూపర్‌సిక్స్‌.. సూపర్‌హిట్‌’ సభకు ఆయన హాజరుకావడం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన వారు ఏదైనా అత్యవసర సహాయం కోసం +91 9818395787 నంబర్‌తో పాటు.. APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సప్ నంబర్ +91 8500027678, ఈ-మెయిల్: helpline@apnrts.com, info@apnrts.com వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంలోనూ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. +977-980 860 2881, +977- 981 032 6134 నంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు వాట్సప్‌లోనూ సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa