తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఘోర అపచారం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అలిపిరి నడకమార్గం వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా పడేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.అలిపిరిలోని పాత చెక్ పాయింట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో మలమూత్రాలు, మద్యం సీసాలు పడేసే చోట విష్ణుమూర్తి విగ్రహాన్ని వదిలేయడం దారుణమని భూమన ఆవేదన చెందారు. ఆ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆయన వాపోయారు. హైందవ ధర్మం పట్ల, హిందూ దేవతల విగ్రహాల పట్ల ప్రస్తుత టీటీడీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ తీవ్రమైన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలని కోరారు. హిందుత్వ సంస్థలు, మఠాధిపతులు ఈ అపచారాన్ని గమనించి మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీటీడీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa