ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆపరేషన్ సింధూర్’లో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది

international |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 08:20 PM

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ మెరుపుదాడిలో జైష్-ఎ-మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా నాశనమైందని ఆ సంస్థకు చెందిన ఓ కీలక కమాండర్ అంగీకరించాడు. ఇది భారత సైనిక చర్యల విజయానికి, అలాగే ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన విధానానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.


జైష్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రసంగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోనే అతడు భారతీయ ఆర్మీ చేసిన దాడి గురించి వివరించారు. ముఖ్యంగా మే 7వ తేదీన భారత బలగాలు తమ స్థావరంపై దాడి చేశాయన్నారు. ఆ దాడిలో మౌలానా మసూద్ అజార్‌కు చెందిన కుటుంబం మొత్తం ముక్కలైపోయిందని ఉర్దూ భాషలో స్పష్టం చేశారు. అతని ప్రసంగం వెనుక తుపాకులతో ఉన్న భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ వీడియో భారత సైనిక చర్యల ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది.


పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది. ఈక్రమంలోనే బహవల్పూర్‌లో ఉన్న మసూద్ అజార్ ఇంటితో పాటు కోట్లి, మురిద్కేలలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలను భారత బలగాలు పేల్చివేశాయి.


‘ఆపరేషన్ సింధూర్’లో బహవల్పూర్ లక్ష్యంగా మారడం వెనుక వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్‌లో 12వ అతిపెద్ద నగరమైన బహవల్పూర్.. లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం జైషే సంస్థ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. జైష్ ప్రధాన కార్యాలయం ‘జామియా మజీద్ సుభాన్ అల్లా’ లేదా ‘ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్’ కూడా ఇక్కడే ఉంది. అయితే భారత బలగాలు నేరుగా ఈ ప్రధాన కేంద్రంపైనే దాడి చేసి, ఉగ్రవాద మూలాలపై దెబ్బ కొట్టాయి.


ఈ సైనిక దాడిని జైష్ కమాండర్ అంగీకరించడం ద్వారా భారత్ చేపట్టిన చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుస్తోంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఇలాంటి నష్టాలను బహిరంగంగా అంగీకరించవు. కానీ ఈసారి మసూద్ అజార్ కుటుంబానికి జరిగిన నష్టం గురించి ఓ కీలక నేత వెల్లడించడం సంచలనంగా మారింది. గతంలో మసూద్ అజార్‌యే నేరుగా తన కుటుంబ సభ్యులు చనిపోయినట్లు వెల్లడించారు. అయితే వారు చనిపోయినందుకు తనకేమీ బాధ లేదని.. వారంతా అల్లా దగ్గరకు వెళ్లారని అన్నాడు. తాను కూడా వారితోపాటే వెళ్లుంటే బాగుండేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa