ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ యుద్ధంపై మధ్యవర్తిత్వం వాదనను పరోక్షంగా ఖండించిన పాక్ మంత్రి

international |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 07:58 AM

భారత్, పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చేసుకునే ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టమైంది. ఈసారి ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో మూడో దేశం ప్రమేయాన్ని భారత్ మొదటి నుంచీ నిరాకరించిందని ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని తనకు అప్పటి అమెరికా రక్షణ మంత్రి మార్క్ రుబియో స్వయంగా చెప్పారని దార్ వివరించారు.జులై 25న తాను మార్క్ రుబియోతో సమావేశమయ్యానని ఇషాక్ దార్ గుర్తుచేసుకున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో యుద్ధ నివారణకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరిపారని తాను రుబియోను అడిగానని తెలిపారు. దీనికి బదులుగా, ఈ వివాదంలో ఏ మూడో దేశం జోక్యాన్నైనా భారత్ కోరుకోలేదని, దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే పరిగణించిందని రుబియో స్పష్టం చేశారని దార్ పేర్కొన్నారు.గతంలో మే నెలలో పహల్గాం దాడి తర్వాత ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన విషయం తెలిసిందే. తమపై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్నత స్థాయి మంత్రి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం, భారత వైఖరిని బలపరిచినట్లయింది. దీంతో ట్రంప్ ప్రచారంలో వాస్తవం లేదని అంతర్జాతీయంగా మరోసారి రుజువైనట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa