‘భాష, జాతిపై అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్మారకార్థం అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మైసూర్లో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో ఏర్పాటు చేశారని, వెంకయ్యనాయుడు అనుమతిస్తే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. 1984 ఆగస్టు సంక్షోభానికి అక్షరరూపం ఇస్తూ రూపొందించిన ‘సజీవ చరిత్ర-1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం’ పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా పోరంకిలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సరిగ్గా 41 ఏళ్ల కిందట జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే ప్రజాబలం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. దేశ రాజకీయాల్లో 1983 ఓ సంచలనమైతే 1984 ఆగస్టు సంక్షోభం... ప్రజాస్వామ్యంలో వర్తమానానికి.. భవిష్యత్తుకు ఓ సందేశంగా నిలిచిపోతుంది. అధికారంలోకి వచ్చిన నెలల్లోనే 1984 ఆగస్టులో నాటి కాంగ్రెస్ చేసిన కుట్రలతో ఎన్టీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1984 వరకు 37 సంవత్సరాల్లో కాంగ్రెస్ 26 ప్రభుత్వాలను పడగొడితే ఒక్కరూ తిరిగి గద్దెనెక్కిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ ఒక్కరే ప్రజా పోరాటంతో మళ్లీ గద్దెనెక్కారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వైపు ఉన్న 161 మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవడం చాలాకీలకంగా మారింది. ఆనాడు కర్ణాటకలోని రామకృష్ణహెగ్డే ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచాయి. దీంతో 1984 సెప్టెంబరు 16న ఎన్టీఆర్ గద్దెనెక్కారు’ అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa