ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కువ ధరకే వస్తువులు అని నమ్మి లక్షల్లో మోసపోయిన వ్యాపారి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 02:06 PM

ఆన్‌లైన్‌లో కనిపించిన ఓ బంపర్ ఆఫర్ ఓ వ్యాపారిని నిలువునా ముంచింది. తక్కువ ధరకే పెద్దమొత్తంలో సరుకులు ఇస్తామన్న ప్రకటనను గుడ్డిగా నమ్మి, ఏకంగా రూ.39.7 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ భారీ మోసం వివరాలను సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత మీడియాకు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్ళితే... మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల యువ వ్యాపారికి సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు. ఈ క్రమంలోనే గత మే 13న టెలిగ్రామ్‌లో ఓ ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల వస్తువులను బల్క్‌గా అత్యంత చౌక ధరకు విక్రయిస్తామని ఆ ప్రకటనలో ఉండటంతో, అతను వెంటనే వారిని సంప్రదించాడు. రూ.30 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.అయితే, సరుకులు డెలివరీ చేయాలంటే ముందుగా రూ.9,99,990 అడ్వాన్స్‌గా చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు పెట్టారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి ఆ మొత్తాన్ని వారికి పంపించాడు. డబ్బు అందిన తర్వాత కూడా వస్తువులు రాకపోవడంతో అనుమానంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు మరో నాటకానికి తెరలేపారు. డెలివరీ పూర్తి కావాలంటే అదనంగా మరో రూ.3 లక్షలు చెల్లించాలని మెలికపెట్టారు. చేసేదేమీ లేక ఆ డబ్బు కూడా పంపించాడు.అయినా సరుకులు పంపకుండా, రకరకాల కారణాలు చెబుతూ విడతలవారీగా అతని నుంచి డబ్బు గుంజుతూనే ఉన్నారు. ఇలా మొత్తం రూ.39.7 లక్షలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa