మెరుగైన రహదారులు ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. రోడ్డు రవాణా మార్గం లేకపోతే వైద్యం, వ్యాపారం, విద్య, పరిశ్రమలు ఇలా ప్రతి దానికి ఇబ్బందులు తప్పవు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారులు విస్తరణ, కొత్తవాటి నిర్మాణం, అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అలానే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 నంబర్ నేషనల్ హైవేని ఆరు వరుసలుగా విస్తరించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
16వ నంబరు జాతీయ రహదారిని మరింత విస్తరించనుంది. దీనిని ఆరు వరుసలుగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. తాజాగా ఇది పట్టాలెక్కబోతుంది ఈ రహదారి తూర్పు గోదావరి జిల్లాలో దివాన్చెరువు నుండి అనకాపల్లి వరకు అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ప్రయాణం సులభం అవ్వడం మాత్రమే కాక.. ఈ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.
16వ నంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా అధికారులు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేశ్లు.. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వరకు ఇప్పటికే ఆరు వరుసల రహదారి ఉంది. దివాన్చెరువు నుంచి అనకాపల్లి మధ్య మాత్రం నాలుగు వరుసల రహదారి ఉంది. ఇప్పుడు దీనిని కూడా ఆరు వరుసలగా విస్తరించనున్నారు.
దీనిలో భాగంగా దివాన్చెరువు-తుని వరకు 92 కి.మీ., పాయకరావుపేట-అనకాపల్లి వరకు 70 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా పైవంతెనలు, అండర్పాస్లు నిర్మిస్తారు. పాయకరావుపేట, కశింకోట, అనకాపల్లి, ఎలకమంచిలి, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో రహదారి అభివృద్ధిపై అంచనాలు వేశారు.
నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట నుంచి మంగవరం మీదుగా తుని పట్టణ శివారు వరకు బైపాస్ రోడ్డును నిర్మించాలని అధికారులు చూస్తున్నారు. అలానే కొత్తగా 6 వరసలుగా రోడ్డును విస్తరించి కాకినాడ జిల్లా తుని మండలంలోని ఎర్రకోనేరు వద్ద ప్రస్తుతం ఉన్న రోడ్డుకు దీనిని అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అలానే నక్కపల్లి మండలంలోని పెదబోదిగల్లం మీదుగా బైపాస్ నిర్మించి అడ్డు రోడ్డుకు కలిపితే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనితో పాటుగా గ్రామాల మధ్యలో పైవంతెనలు నిర్మించబోతున్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసు రోడ్లు కూడా ఉంటాయి. దీని కోసం భూమిని సేకరించాల్సి ఉంటుంది. నక్కపల్లిలో మిట్టల్ స్కీల్ కర్మాగారం, బల్క్డ్రగ్ పరిశ్రమ వస్తున్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో రహదారులు బాగుంటే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి అవుతుందుని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa