పండుగల వేళ ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) ఏ రకమైన బహుమతులు లేదా మర్యాదపూర్వక కానుకలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో భాగంగా ఈ కఠినమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు, కార్యాలయాలకు ఒక సందేశాన్ని పంపింది. ప్రభుత్వ నిధులతో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ లేదా ఇతర బహుమతులను కొనుగోలు చేయడాన్ని ఈ ఆదేశం స్పష్టంగా నిషేధించింది. అయితే ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ప్రజాధనం సరైన మార్గంలో ఉపయోగపడేలా చూడటం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చర్య ప్రభుత్వ యంత్రాంగంలో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక తాత్కాలిక నిర్ణయం కాదని.. ప్రభుత్వం చాలా కాలంగా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగా నిలుస్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇలాంటి పొదుపు చర్యలు చేపడుతోంది. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో జరిగే అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా ఆ నిధులను అత్యవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా బాధ్యతాయుతమైన వైఖరిని ప్రోత్సహించడమే కాకుండా పన్ను చెల్లింపుదారుల డబ్బును వివేకంతో ఉపయోగిస్తున్నామనే సందేశాన్ని కూడా ప్రజలకు పంపుతుంది.
ప్రభుత్వ ఆదేశం ప్రకారం.. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రజాధనాన్ని ఉపయోగించి గిఫ్టులు ఇవ్వకూడదు. ఈ నిర్ణయం ద్వారా ప్రజాధనం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశం కేవలం దీపావళికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ వర్తింపజేయాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను పెంచితే.. మరోవైపు ప్రజాధనం పట్ల తన బాధ్యతను కూడా చాటిచెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa