ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:47 PM

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. జ్వరంతోనే సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపింది. అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహించారని వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారని జనసేన పార్టీ వెల్లడించింది.


మరోవైపు పవన్ కళ్యాణ్ ఆదివారం రోజున హైదరాబాద్‌లో జరిగిన ఓజీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ.. భారీగా తరలివచ్చిన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో వానలో తడుస్తూనే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రసంగంతో ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. అనంతరం విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం కనకదుర్గమ్మను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ స్వామివారిని దర్శించుకున్నారు. అయితే భారీ వర్షంలో తడవటం, బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్ సోకినట్లు తెలుస్తోంది.


మరోవైపు సెప్టెంబర్ 25న ఓజీ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి పది గంటలకు ప్రీమియర్ షో వేయనున్నారు. అయితే ఏపీలో ఓజీ ప్రీమియర్‌ షో సమయం మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 25న అర్ధరాత్రి ఒంటి గంట షోకు బదులుగా.. 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోకు అవకాశం కల్పించారు. అలాగే ఓజీ బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ.1000గా నిర్ధారించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.125 , మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 మేరకు అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ విషయానికి వస్తే ఓజీ ప్రీమియర్ షో టికెట్‌ ధర రూ.800 గా ఉంది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచేందుకు అనుమతి ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa