జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని బైసరాన్ లోయలో ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఘోరమైన ఉగ్రదాడి.. యావత్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు సహా మొత్తం 26 మంది అమాయకలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు.. పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. వంద మందికిపైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఇక పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై క్షిపణుల వర్షం కురిపించి నేలమట్టం చేసింది. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తాన్ -మద్దతుగల ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులకు లాజిస్టికల్ మద్దతు అందించిన 26 ఏళ్ల కాశ్మీరీ యువకుడిని భద్రతా బలగాలు బుధవారం అరెస్ట్ చేశాయి.
జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారియా.. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు సహకరించినట్లు గుర్తించి.. అతడ్ని అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలు చేపట్టిన దర్యాప్తులో మొహమ్మద్ యూసుఫ్ కటారియా.. ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహకారం అందించినట్లు తేలింది. ఇక నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతడిని 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించారు. ఇటీవల ఆపరేషన్ మహాదేవ్ చేపట్టిన భారత బలగాలు.. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను విశ్లేషించగా.. ఈ మొహమ్మద్ యూసుఫ్ కటారియా పాత్ర బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన మొహమ్మద్ యూసుఫ్ కటారియా.. స్థానికంగా ఉండే పిల్లలకు పాఠాలు చెప్పేవాడని.. కొన్ని నెలల క్రితం ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని వారికి సహాయం చేయడం ప్రారంభించాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు లష్కర్ ఉగ్రవాదులు కుల్గామ్లోని అటవీ ప్రాంతాల్లో ప్రయాణించడానికి మొహమ్మద్ యూసుఫ్ కటారియా సహాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడి కావడం గమనార్హం.
ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్మూ, కాశ్మీర్లోకి చొరబడినప్పటి నుంచి.. వారికి సహాయం చేసిన వారి గురించి కూడా ఇఫ్పటికే దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దాడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు పర్వేజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్ను ఈ ఏడాది జూన్లోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే వారి నుంచి ముగ్గురు ఉగ్రవాదులు లష్కర్ కమాండర్ సులేమాన్ షా, ఆఫ్ఘన్, జిబ్రాన్ పేర్లను రాబట్టిన భద్రతా బలగాలు.. జూలైలో చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఆ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక ఆపరేషన్ మహాదేవ్పై పార్లమెంటులో వివరాలు వెల్లడించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందినవారని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa