ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంచలన నిర్ణయం తీసుకున్న ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు

international |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 05:54 PM

టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎలిసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మొత్తం సంపద 377 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30 లక్షల కోట్లు)లో 95 శాతాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.  ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే ఆధునిక చరిత్రలో అతిపెద్ద ప్రైవేట్ సంపద బదిలీలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో ల్యారీ ఎలిసన్ రెండో స్థానంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వచ్చిన అనూహ్యమైన వృద్ధి కారణంగా 2025లో ఒరాకిల్ షేర్ల విలువ భారీగా పెరిగింది. కంపెనీలో ఇప్పటికీ 41 శాతం వాటా ఉన్న ఎలిసన్ సంపద అమాంతం పెరిగింది. దీనికి తోడు టెస్లాలో కూడా ఆయనకు గణనీయమైన వాటాలు ఉన్నాయి. తన సంపదను దాతృత్వానికి వినియోగిస్తానని 2010లోనే ‘గివింగ్ ప్లెడ్జ్’పై సంతకం చేసినప్పటికీ, ఆయన ఇతర బిలియనీర్లలా సంప్రదాయ స్వచ్ఛంద సంస్థల వైపు మొగ్గు చూపడం లేదు.దానికి బదులుగా తన సొంత సంస్థల ద్వారానే ఈ బృహత్కార్యాన్ని చేపట్టాలని ఎలిసన్ భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రంగా లాభాపేక్షతో పనిచేసే పరిశోధనా సంస్థ ‘ఎలిసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఈఐటీ)ని ఏర్పాటు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యలైన క్యాన్సర్ పరిశోధన, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఏఐ ఆవిష్కరణలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌లో 1.3 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ 2027 నాటికి ప్రారంభం కానుంది.అయితే, ఎలిసన్ దాతృత్వ ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగడం లేదు. ఈఐటీ సంస్థలో నాయకత్వ సంక్షోభం తలెత్తినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో ఒక కథనాన్ని ప్రచురించింది. 2024లో ఈ సంస్థకు అధిపతిగా నియమితులైన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ బెల్ కొన్ని నెలలకే రాజీనామా చేశారు. ఇది "చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామం సంస్థ స్థిరత్వంపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఏది ఏమైనప్పటికీ, ల్యారీ ఎలిసన్ తన ప్రతిజ్ఞను నెరవేరిస్తే, అది శాస్త్ర, మానవతా రంగాలకు అందే నిధుల స్వరూపాన్నే మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa