అగ్రరాజ్యం అమెరికా భారత్పై 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి పాకిస్థాన్ ఆ దేశంతో బంధాన్ని బలపరుచుకుంటూ వస్తోంది. ఇంకా టారిఫ్ వార్ కొనసాగుతుండగానే అనేక మార్లు ట్రంప్ను కలిసి కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ వైట్హౌస్ను సందర్శించారు. ట్రంప్తో కలిసి భేటీ నిర్వహించారు. అయితే దీనికి మీడియాను కూడా అనుమతించలేదు. దీంతో అందరి దృష్టి వీరి సమావేశంపైనే పడింది.
తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనడానికి యూఎస్ వెళ్లారు. ఈ సందర్భంగానే ఆయన వైట్ హౌస్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశానికి ప్రధాని షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ మునీర్ కూడా హాజరు కావడం ఈ భేటీకి మరింత ప్రాధాన్యతను ఇచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని షరీఫ్ వైట్హౌస్కు చేరుకోగా.. అక్కడ సీనియర్ పరిపాలనా అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అయిన వైట్ హౌస్లోని ప్రతిష్టాత్మకమైన ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో షరీఫ్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు.
సాధారణంగా జరిగే దౌత్యపరమైన సమావేశాల మాదిరిగా కాకుండా.. ఈ మీటింగ్కు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. దీన్ని చూస్తుంటేనే కీలకమైన, గోప్యమైన అంశాలపై చర్చలు జరిగాయని దీని అర్థం అవుతోంది. అయితే ఈ సమావేశానికి ముందే మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ప్రధాని గురించి ప్రస్తావించారు. షెహబాజ్ షరీఫ్ను గొప్ప నాయకుడు అంటూ బహిరంగంగా ప్రశంసించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ కావడం ఇదే మొట్టమొదటిసారి కావడం వలన ఈ సమావేశం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాకిస్థాన్లో సైనిక నాయకత్వానిదే పెత్తనం అన్న విషయం జగమెరిగిన సత్యం. అందుకే ప్రధాన మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ కూడా అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం, ఇరు దేశాల ప్రస్తుత సంబంధాలలో సైన్యం కేంద్ర పాత్రను నొక్కి చెబుతోంది. గతంలో ట్రంప్ పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించినప్పటికీ.. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అనూహ్యంగా పెరుగుతుండడం.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ భేటీలో వాణిజ్యం, ప్రాంతీయ భద్రతతో పాటు భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ పాత్ర వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa