ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు తెచ్చామంటే.. అసెంబ్లీలో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 09:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఎంతమందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలను అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు వివరించారు. గత 15 నెలల్లో అన్ని రంగాల్లోనూ, అన్ని సెక్టార్లలోనూ కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటి వరకూ మెగా డీఎస్సీ ద్వారా 15941 ఉద్యోగాలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9093 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 6100 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149 ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం ద్వారా 5500 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు వివరించారు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ఏ ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారనే వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని చంద్రబాబు ప్రకటించారు.


మరోవైపు ట్రాఫిక్ పరిస్థితులు, స్థానిక భూములు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కొత్త రోడ్లు వేస్తామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జాతీయ రహదారుల విషయంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. రూ.1.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రారంభమైందని గుర్తు చేశారు.


రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి.. లాజిస్టిక్స్‌పై రూ.2.5లక్షల కోట్ల వరకూ ఖర్చు పెట్టొచ్చన్నారు. మరోవైపు వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఆలోచనలు చేశాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర బ్రాండ్‌ను వైసీపీ దెబ్బతీసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులు, సంస్థలలో నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు.. తమ ప్రయత్నాలు ఫలించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని వివరించారు.


ఈ కంపెనీల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. మరోవైపు 2026 ఆగస్టు కల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa