ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరువణ్ణామలైలో నిర్మాణాలపై ఫిర్యాదులు.. అరుణాచలం ఆలయంలో హైకోర్టు జడ్జిల పరిశీలన

national |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 08:24 PM

హిందూ ఆలయాలకు నెలవైన తమిళనాడులో ఇటీవల గత కొన్నేళ్లుగా తిరువణ్ణామలై ఆలయం ( అరుణాచలేశ్వర ఆలయం )బాగా ఫేమస్ అయింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరువణ్ణామలై వెళ్తున్నారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఆలయంలో నిర్మాణాలు చేస్తున్నారు. అయితే తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ (టీఎన్‌హెచ్ఆర్‌సీఈడీ) చేపట్టిన నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు అక్టోబర్ 5వ తేదీన ప్రత్యక్ష పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16వ తేదీన జరగనుండగా.. అప్పటివరకు అరుణాచలేశ్వర ఆలయం పరిధిలో అన్ని నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.


మద్రాస్ హైకోర్టు ప్రత్యేక డివిజన్ బెంచ్‌కు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. సురేష్ కుమార్, జస్టిస్ ఎస్. సౌందర్.. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలించాలని నిర్ణయించారు. అక్టోబర్ 16వ తేదీన విచారణ ఉండగా.. అంతకు ముందుగానే అక్టోబర్ 5వ తేదీన ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఆలయ హితసంరక్షకుడు టీఆర్ రమేష్ 2024లో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు ఈ విచారణను జరుపుతోంది. 2023లో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా ఆలయ నిధులతో రాజగోపురం బయట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడాన్ని.. టీఆర్ రమేష్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున హెచ్‌ఆర్‌సీఈ శాఖ మొదట షాపింగ్ కాంప్లెక్స్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చని.. దాని బదులుగా భక్తులకు క్యూ కాంప్లెక్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది.


అయితే.. పిటిషనర్ టీఆర్ రమేష్ తాజాగా సమర్పించిన ఫొటోలు చూస్తే ఆలయ ప్రాంగణంలోనే నిర్మాణాలు ప్రారంభమైనట్లు తెలిసింది. ఆ ఫొటోలను పరిశీలించిన జడ్జిలు.. ఆలయ వారసత్వ గోడల వద్ద జరుగుతున్న పనులు ఆలయ సౌందర్యంపై ప్రభావం చూపవచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్‌పై అక్టోబర్ 16వ తేదీన విచారణ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5వ తేదీన స్వయంగా ఆలయాన్ని సందర్శించి పరిస్థితులు పరిశీలిస్తామని జడ్జిలు ప్రకటించారు. అప్పటి వరకు అక్కడ జరుగుతున్న అన్ని నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa