ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిగ్-21కు తుది వీడ్కోలు పలికిన ఐఏఎఫ్ మహిళా పైలట్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 08:24 PM

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ చరిత్రలో మిగ్-21 యుద్ధ విమానం కథ ముగిసింది. శుక్రవారం రోజున మిగ్-21 ఫైటర్ జెట్‌కు చంఢీగఢ్ ఎయిర్‌బేస్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. 62 ఏళ్లుగా భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషించి.. ఎన్నో యుద్ధాల్లో సేవలు అందించిన మిగ్-21 పైటర్ జెట్‌కు భారత వాయుసేన గుడ్ బై చెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. 1963లో చంఢీగఢ్ స్థావరంలో మొదటగా ప్రవేశపెట్టబడిన ఈ మిగ్-21 యుద్ధవిమానం.. 62 ఏళ్లుగా దేశ రక్షణలో పాలుపంచుకుంది. ఇక ఈ మిగ్-21 రిటైర్మెంట్ సందర్భంగా.. చివరి రైడ్‌ను ఐఏఎఫ్ స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ పూర్తి చేశారు. దీంతో మిగ్–21 చివరి ప్రయాణానికి ఒక మహిళా ఫైటర్ పైలట్‌గా ప్రియా శర్మ చరిత్ర సృష్టించారు.


రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా పిలానీ ప్రాంతానికి చెందిన ప్రియా శర్మ.. 2017లో హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరారు. ఆమె తండ్రి బీదర్‌లో ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. అప్పట్లో నిత్యం ఫైటర్ జెట్లను చూసిన ప్రియా శర్మ.. పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఎయిర్‌ఫోర్స్‌లో చేరితే దేశానికి సేవ చేయవచ్చని నిర్ణించుకున్నారు. ఇక దుండిగల్‌లో 2017 బ్యాచ్‌లో ప్రియా శర్మ ఏకైక మహిళా ఫైటర్‌ పైలట్‌ కావడం గమనార్హం.


భారత వైమానిక దళంలోనే ఏడో మహిళా ఫైటర్‌ పైలట్‌గా కూడా ఆమె చరిత్రలో నిలించారు. ఐఐఐటీ కోటా నుంచి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత తన తండ్రి అడుగుజాడల్లో నడిచి ఎయిర్‌ఫోర్స్‌లో ప్రియా శర్మ చేరారు. అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నుంచి 2018లో గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌ అందుకుని ఐఏఎఫ్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మొదట హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో చేరారు. తర్వాత కర్ణాటకలోని బీదర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో అడ్వాన్స్‌డ్‌(స్టేజ్‌-3) పూర్తి చేశారు.


మరోవైపు.. గత ఆగస్ట్‌ నెలలో రాజస్థాన్‌ బికనేర్‌లోని నాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మిగ్–21 ఫైటర్ జెట్ ఫేర్‌వెల్ ఫ్లైపాస్ట్‌లో కూడా ప్రియా శర్మ పాల్గొనడం విశేషం. తాజాగా చండీగఢ్‌లో జరిగిన చారిత్రక ఫైనల్ సార్టీతో మిగ్–21 యుద్ధ విమానం గాథలో తన పేరు మరింత బలంగా ఆమె నిలిపారు. మరోవైపు.. పాంథర్స్‌గా ప్రసిద్ధి చెందిన నంబర్ 23 స్క్వాడ్రన్.. మిగ్-21కు ఫ్లైపాస్ట్ నిర్వహించింది. ఇక ఈ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ కానన్ సెల్యూట్ ఇచ్చాయి. అకాశ్ గంగా స్కైడైవింగ్ టీమ్ ప్రదర్శన, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ ఇందులో బాగా ఆకట్టుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa