ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య అక్టోబర్ 13, 2025న కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం, హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఈ బందీలు 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం నుంచి గాజాలో నిర్బంధంలో ఉన్నారు.దీనికి ప్రతిగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం 1,900 నుంచి 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 250 మంది వరకు కఠిన శిక్షలు లేదా యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవిస్తున్న వారు కాగా, మిగిలిన 1,700 మంది యుద్ధ సమయంలో అదుపులోకి తీసుకున్న పౌరులు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పందిస్తూ, “మేము శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం. మధ్యప్రాచ్యంలో ఇక యుద్ధ వాతావరణం ముగిసింది” అని వ్యాఖ్యానించారు. అయితే, గాజా ప్రాంతం పర్యవేక్షణ ఎవరి ఆధీనంలోకి వెళ్తుందన్న ప్రశ్న ఇంకా అనుమానంగా ఉంది.శాంతి ఒప్పందం ప్రకారం, తొలి విడతలో ఏడుగురు బందీలను, ఆ తర్వాత మరో 13 మందిని హమాస్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 2,000 మందికిపైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. దీంతో వెస్ట్ బ్యాంక్ మరియు గాజా ప్రాంతాల్లో సంబర వాతావరణం నెలకొంది. ఖైదీలు బస్సుల ద్వారా తమ ఇళ్లకు చేరుకోగా, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. అలాగే, విడుదలైన 20 మంది ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి చేరుకున్న సందర్భంగా టెల్ అవీవ్ నగరంలో కూడా సంబరాలు చెలరేగాయి.ఈ శాంతి ఒప్పందం సాధనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. యుద్ధం ముగిసిన అనంతరం ట్రంప్ ఇజ్రాయెల్ పర్యటించి, పార్లమెంటులో ముఖ్య ప్రసంగం చేశారు. ఆయనతో పాటు అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, మరియు అమెరికా రాయబారి మైక్ హకబీలకు కూడా ప్రత్యేక సత్కారాలు అందించబడ్డాయి.ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ట్రంప్కు తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని నెతన్యాహు చేతుల మీదుగా అందజేసింది. ట్రంప్ భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతి అందుకుంటారని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి స్థాపనకు కారణమైన ట్రంప్కు ఇజ్రాయెల్ పార్లమెంట్లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. కొన్ని నిమిషాల పాటు చప్పట్లతో ఆయనను అభినందించారు. “ప్రపంచానికి ఇలాంటి నాయకులు మరిన్ని అవసరం” అని పార్లమెంట్ సభ్యులు ట్రంప్ను ప్రశంసించారు. ట్రంప్ మాట్లాడుతూ, “శాంతి సాధనలో మాకు సహకరించినందుకు నెతన్యాహు గారికి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్లో కొత్త గోల్డెన్ ఏజ్ ప్రారంభమైంది” అని పేర్కొన్నారు.గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఆ దాడిలో 1,200 మందికి పైగా మరణించగా, 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. వారిలో కొంతమందిని హమాస్ స్వయంగా విడుదల చేయగా, మరికొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. అయితే 20 మంది మాత్రమే సజీవంగా మిగిలి ఉండగా, వారిని తాజాగా హమాస్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa