గాజా కాల్పుల విరమణపై ప్రపంచ నాయకులు తీవ్ర చర్చలు జరుపిన ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ శాంతి సదస్సులో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడిన చిన్న వీడియో క్లిప్ ఆన్లైన్లో వైరల్ అయింది. అందులో ఎర్డోగాన్ నవ్వుతూ మెలోనీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ.. మీరు విమానం నుంచి దిగుతుండగా మిమ్మల్ని చూశానని అన్నారు. అప్పుడు మీరు చాలా అద్భుతంగా కనిపించారంటూనే.. మీరు పొగతాగడం ఆపేయాలని చమత్కరించారు.
పక్కనే నిలబడి ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా ఇందుకు నవ్వుతూ ఈ సంభాషణలో జోక్యం చేసుకున్నారు. ఇది అసాధ్యం అని బదులు ఇచ్చారు. దీనికి కొద్దిగా ఆశ్చర్యపోయినా.. వెంటనే తేరుకున్న మెలోనీ నవ్వుతూనే నాకు తెలుసు, నేను ఎవర్నీ చంపాలని అనుకోవడం లేదని సమాధానం ఇచ్చారు. ఇటలీ ప్రధాని మెలోనీ గతంలో 13 ఏళ్ల పాటు పొగతాగడం మానేసి.. ఇటీవలే తిరిగి ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఫన్నీ అని కొందరు, నిజంగానే మీరు సిగరెట్ మానేస్తే బాగుంటుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో టర్కీ.. పొగాకు నియంత్రణ కోసం విపరీతంగా కష్టపడుతోంది. ఇందుకు సంబంధిచిన నిషేధాలు, నిబంధనలను గురించి మీడియా ద్వారా ఎక్కువగా ప్రచారాలు చేయించి పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలోనే ఎర్డోగాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ప్రపంచ నాయకులు ఈ సరదా సంభాషణ తర్వాత మళ్లీ గాజా కాల్పుల విరమణను స్థిరీకరించడంపై తమ దృష్టిని కేంద్రీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి సహ-అధ్యక్షత వహించిన ఈ సదస్సు.. ప్రాంతీయ స్థిరత్వం, యుద్ధానంతర పునర్నిర్మాణం గురించి చర్చించడానికి 20కి పైగా ప్రపంచ నాయకులను ఒకే వేదికపైకి చేర్చింది.
ఈ సదస్సు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కీలక ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో మిగిలి ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. దాదాపు రెండేళ్ల సంఘర్షణ తర్వాత బందీలను విడుదల చేయగా వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 1,900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ట్రంప్.. ఈ కాల్పుల విరమణను శాంతికి ఒక మలుపుగా అభివర్ణించారు. ఇతర నాయకులతో కలిసి యుద్ధం తర్వాత చేయాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa