ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరాశపర్చిన టెక్ మహీంద్రా.. క్యూ2లో తగ్గిన లాభం

business |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:22 PM

ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్రా నిరాశపరిచింది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 రెండో త్రైమాసికం (జూలై- సెప్టెంబర్)లో అంచనాలను అందుకోలేక పోయింది. మంగళవారం స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో టెక్ మహీంద్రా నికర లాభం రూ.1194 కోట్లుగా నమోదు చేసింది. అయితే, గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన కంపెనీ నికర లాభం రూ.1250 కోట్లతో పోలిస్తే 4.4 శాతం మేర పడిపోయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సును కంపెనీ ఓనర్లకు ఆపాదించింది. క్యూ2 ఫలితాల్లోని కీలక విషయాలు తెలుసుకుందాం.


ఇక జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ రూ.13,995 కోట్లుగా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లోని రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.13,313 కోట్లతో పోలిస్తే ఈ సారి ఆదాయం 5.1 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక ఫలితాల క్రమంలోనే తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు గానూ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.15 చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని వెల్లడించింది. ఇందుకు సంబందించిన రికార్డ్ తేదీని అక్టోబర్ 21, 2025గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆలోపు షేర్లు కొనుగోలు చేసి ఉన్న వారికి డివిడెండ్ పొందేందుకు అర్హత లభిస్తుంది.


ఇక త్రైమాసికాల ప్రాదిపదికన చూసుకుంటే టెక్ మహీంద్రా నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లోని రూ.1141 కోట్లతో పోలిస్తే 4.7 శాతం పెరిగింది. ఇక కంపెనీ ఆదాయం 4.8 శాతం పెరిగింది. ఇక కంపెనీ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్  రూ.1699 కోట్ల వద్ద ఉంది. ఇక క్వార్టర్ టూ క్వార్టర్ చూస్తే 15 శాతం, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 32.7 శాతం మేర పెరిగింది. ఇక టెక్ మహీంద్రా డాలర్ల ఆదాయం 1586 మిలియన్ డాలర్లుగా ఉంది. క్వార్టర్ టూ క్వార్టర్ చూస్తే 1.4 శాతం పెరిగింది. ఇక స్థిర కరెన్సీలో చూస్తే 1.6 శాతం పెరిగింది. ఎబిటా 192 మిలియన్ డాలర్లుగా చూపించింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో 816 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులు ఉన్నట్లు తెలిపింది.


లాభాల్లో ముగిసిన షేరు ధర


ఫలితాల ప్రకటన నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు లాభాల్లో ముగిసింది. మంగళవారం రోజు మార్కెట్లు ముగిసే సమయానికి 1.24 శాతం లాభంతో రూ.1468.90 వద్ద ముగిసింది. గత వారంలో 0.84 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో 3.35 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో 13 శాతం లాభపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1807.70 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.1209.40 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.44 లక్షల కోట్లుగా ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa