ఇటీవల పాకిస్థాన్ సైనిక స్థావరాలపై జరిపిన దాడులకు సంబంధించిన వీడియో తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో కొన్నాళ్లుగా సాగుతోన్న ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి తాలిబన్లు జరిపిన దాడిలో 58 మంది పాక్ సైనికులు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు. ఈ దాడిలో తాలిబన్లవైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ దాడికి సంబంధించి తాలిబన్లు విడుదల చేసిన వీడియోలో.. మోర్టార్ రౌండ్ మాదిరిగా ఉండే చిన్న పేలుడు పదార్థాన్ని పాకిస్థాన్ ఔట్పోస్ట్గా చెబుతోన్న చతురస్రాకారపు నిర్మాణంపై ఓ డ్రోన్ జారవిడుస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాంబు దాడితో ఆ నిర్మాణం పైకప్పు ధ్వంసమైంది.
పాకిస్థాన్ సరిహద్దుల్లో అఫ్ఘన్ యుద్ధ ట్యాంకులను మోహరించడంతో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. గతవారం రాజధాని కాబూల్ సహా అఫ్గన్లో పేలుళ్ల అనంతరం రెండు పొరుగు దేశాల మధ్య హింస చెలరేగింది. తమ భూభాగంలో పాక్ దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ తాలిబన్లు ప్రతీకార దాడులు ప్రారంభించారు. అఫ్గన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పాకిస్తాన్ చేస్తోన్న ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. తాజాగా ఘర్షణల్లో తాలిబన్ సైన్యం తమకు చెందిన రెండు పెద్ద సైనిక పోస్ట్లపై దాడిచేసినట్టు పాకిస్థాన్ ఆరోపించింది. ప్రస్తుతం తాలిబన్లు విడుదల చేసి డ్రోన్ వీడియో వీటిలో ఒకటి అయ్యే అవకాశం ఉంది.
రెండు దాడులను తిప్పికొట్టామని మంగళవారం సాయంత్రం అఫ్గన్ సరిహద్దు పరిధిలోని కాందహార్ దక్షిణ ప్రాంతం స్పిన్ బొల్దాక్ సమీపంలో తమ సైన్యం కాల్పుల్లో సుమారు 20 తాలిబన్ యోధులు హతమయ్యారని పాకిస్థాన్ తెలిపింది. ఇక, స్పిన్ బొల్దాక్ సమీపంలో జరిగిన ఘర్షణల్లో 15 మంది పౌరులు చనిపోయారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తాలిబన్లు ప్రకటించారు.
స్పిన్ బొల్దాక్ ప్రాంత అఫ్గన్ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ హక్మల్ మాట్లాడుతూ.. మోర్టార్ దాడిలో పౌరులు చనిపోయారని తెలిపారు. పాకిస్థాన్ సైన్యా మరోసారి భారీ ఆయుధాలతో దాడులకు దిగాయని తాలిబన్ ప్రభుత్వం ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆరోపించారు. అయితే, తాలిబన్ మంత్రి అమిర్ ఖాన్ ముత్తిఖీ తొలిసారి భారత్కు వచ్చిన సమయంలోనే కాబూల్, సహా అఫ్గన్లో గతవారం పాక్ దాడులకు దిగడం గమనార్హం.
తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని పలుసార్లు అప్గన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని పాక్ రక్షణ మత్రి ఖవాజా ముహమ్మద్ అసిఫ్ గతవారం ఆ దేశ పార్లమెంట్లో తెలిపారు. తాలిబన్ సిద్ధాంతాలను అనుసరించే టీటీపీకి అఫ్గన్లోనే శిక్షణ అందుతోందని దాయాది ఆరోపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa