జనం ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ రిస్క్ ఉన్న వాటి విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో బంపర్ రిటర్న్స్ వస్తుంటాయని చెబుతుంటారు. రిస్క్ లేకుండా మంచి లాభాలు రావాలంటే.. సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు వంటి వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల బంగారం కూడా భారీ రిటర్న్స్ ఇస్తోంది. వీటితో పాటుగా ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా పథకాల్ని తీసుకొస్తోంది. వీటిల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు జనం ఇటీవల ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధివిధానాలతో కొత్త పథకాల్ని తీసుకొస్తూనే ఉంది.
ఇప్పుడు మరో 2 కొత్త స్కీమ్స్ను ప్రకటించింది. ఇవే ఎల్ఐసీ జన్ సురక్ష , ఎల్ఐసీ బీమా లక్ష్మీ పథకాలు. ఇవి రెండూ అక్టోబర్ 15 నుంచి అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్లో వెల్లడించింది. ఈ రెండు బీమా పథకాలు.. వివిధ వర్గాల వ్యక్తుల అవసరాల్ని తీర్చేందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చారు.
>> ఎల్ఐసీ జన్ సురక్ష పథకం.. తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం దీనిని రూపొందించారు. ఇది నాన్ పార్టిసిపేంట్, నాన్ లింక్డ్ స్కీమ్. అంటే ఇది మార్కెట్తో లేదా కంపెనీ లాభాలు లేదా బోనస్తో ముడిపడి ఉండదన్నమాట. మైక్రో ఇన్సూరెన్స్ కావడంతో ఇక్కడ తక్కువ ప్రీమియం, అనుకూలమైన చెల్లింపు ఎంపికలతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రక్షణ కల్పిస్తోంది.
>> ఎల్ఐసీ బీమా లక్ష్మీ అనేది ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకురానున్న మరో బీమా పథకం. ఇది కూడా నాన్ పార్టిసిపేంట్, నాన్ లింక్డ్ స్కీమ్. కాబట్టి ఇక్కడ కూడా రాబడి.. మార్కెట్ పనితీరుతో సంబంధం ఉండదు. బోనస్ కూడా ఉండదు. ఈ ప్లాన్ ద్వారా లబ్ధిదారులకు.. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు.. మెచ్యూరిటీ లేదా పొదుపు చెల్లింపు (సేవింగ్స్ పే అవుట్) ప్రయోజనం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు.. అక్టోబర్ 15న తెలిసే అవకాశం ఉంటుంది.
అయితే ఎల్ఐసీ కొత్త పథకాల్ని ప్రకటించిన నేపథ్యంలో.. ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఎల్ఐసీ షేర్ ధర కాస్త పుంజుకుంది. కిందటి సెషన్లో రూ. 897.25 వద్ద ముగియగా.. ఇవాళ దాదాపు ఒక శాతం పెరిగి రూ. 906 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఇది రూ. 900 పైనే ట్రేడవుతోంది. మార్కెట్ విలువ రూ. 5.70 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 1007.80 కాగా.. కనిష్ట ధర రూ. 715.30 గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa