ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు.. రూ.వేల కోట్లకు దావా, 3 వేల మంది బాధితులు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 10:07 PM

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చిక్కుల్లో పడింది. మనం రోజూ ఉపయోగించే వస్తువులను ఉత్పత్తి చేసే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ న్యాయపరంగా భారీగా చిక్కులు ఎదుర్కొంటోంది. చిన్నపిల్లలకు సంబంధించి బేబీ షాంపూలు, పౌడర్లు, బాడీ ఆయిల్, హెయిర్ ఆయిల్ సహా అనేక ఉత్పత్తులను తయారు చేసే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్‌లో క్యాన్సర్ రోగానికి కారణం అయ్యే ఆస్బెస్టాస్ ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే యూకేలో 3 వేల మంది బాధితులు.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ.. హానికరమైన ఉత్పత్తులు విక్రయిస్తోందంటూ దావా వేశారు.


జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేసే బేబీ పౌడర్‌లో ముఖ్య పదార్ధమైన టాల్క్ అనే సహజంగా లభించే ఖనిజం.. తరచుగా ఆస్బెస్టాస్ నిక్షేపాల దగ్గర లభిస్తుందని.. దీని కారణంగా మైనింగ్ సమయంలో కాలుష్యం జరిగే అవకాశం ఉందని బాధితుల తరఫు న్యాయవాదులు దావాలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దావా ప్రకారం.. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల్లో ట్రెమోలైట్, యాక్టినోలైట్ వంటి ఫైబరస్ ఖనిజాలు కూడా ఉన్నాయని.. ఇవి ఆస్బెస్టాస్‌గా పేర్కొంటారని ఆరోపించారు.


అయితే అంతర్గత మెమోలు, శాస్త్రీయ నివేదికల ఆధారంగా.. 1960 ప్రారంభంలోనే తమ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయని.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి తెలుసని ఈ దావాలో ఆరోపించారు. 1970ల్లో కూడా ఆస్బెస్టాస్ ఫైబర్‌లను కనుగొన్నప్పటికీ.. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా.. స్వచ్ఛమైంది, సురక్షితమైంది అంటూ ఆ సంస్థ విక్రయించినట్లు తెలిపారు. ఆస్బెస్టాస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెసోథెలియోమా (అంతర్గత అవయవాల లైనింగ్‌లో వచ్చే తీవ్రమైన క్యాన్సర్), అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు.


అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పూర్తిగా ఖండించింది. తమ ఉత్పత్తులు ఎల్లప్పుడూ నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని.. వాటిలో ఎప్పుడూ ఆస్బెస్టాస్ లేదని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణం కావని కంపెనీ తేల్చి చెప్పింది. దాదాపు వందల మిలియన్ల పౌండ్లు (భారత కరెన్సీలో ఏకంగా వేలాది కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఈ దావా వేశారు. అయితే ఇది బ్రిటీష్ చరిత్రలోనే అతిపెద్ద దావా కేసుగా మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అమెరికాలోనూ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కొన్ని వేలాది దావాలు గతంలో నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటికే 67 వేల మందికి పైగా బాధితులు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై దావాలు వేశారు. కొన్ని కేసుల్లో 966 మిలియన్ డాలర్ల భారీ నష్టపరిహారాలను కూడా ఇప్పటికే చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ఒత్తిడి కారణంగా.. తమ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్‌ను 2020లో అమెరికా మార్కెట్ నుంచి.. ఆ తర్వాత 2023లో బ్రిటన్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుని.. కార్న్‌స్టార్చ్ ఆధారిత ప్రత్యామ్నాయానికి జాన్సన్ అండ్ జాన్సన్ మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa