ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైకప్పు కూలి....నిద్రలోనే ముగిసిన కేఫ్ కల

Crime |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:19 PM

మనిషి జీవితం ఒక అర్ధాంతర ప్రయాణం. అది ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియని నిత్య సత్యం. నిన్నటి వరకు ఎన్నో ఆశల పల్లకీలు మోసిన గుండె, మరు నిమిషంలోనే మృత్యువు ఒడిలోకి చేరింది. భవిష్యత్తు కోసం సుందర స్వప్నాలు కంటూ.. తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నించిన ఒక సామాన్య కుటుంబంపై విధి దారుణంగా పగబట్టింది.


ఆశల చిగురు..


నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి గ్రామానికి చెందిన వెంకన్న జీవితం కూడా సాధారణ మధ్యతరగతి జీవితమే. రైల్వే శాఖలో గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తున్న ఆయనకు, భార్య నాగమణి, కొడుకు విరాట్ కృష్ణ, కూతురు నందిని, మరియు తల్లి పార్వతమ్మ ఉన్నారు. తన పిల్లలకు గొప్ప చదువులు చెప్పించి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. అయితే.. ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో.. వెంకన్న ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.


వెంకన్న తన కలల వ్యాపారానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి శివారులో ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక ‘డాన్ కిట్ ఫిల్టర్ కాఫీ కేఫ్’ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుకు తోడు కొంత అప్పు కూడా చేసి.. ఒక అద్దె భవనాన్ని తీసుకొని కేఫ్‌ను సిద్ధం చేశాడు. ఆదివారం శుభ ముహూర్తంగా కేఫ్‌ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు రోజు.. అంటే శనివారం రాత్రి, వెంకన్న కుటుంబంతో కలిసి కేఫ్‌లోనే పడుకున్నాడు. కేఫ్ కోసం రేకుల షెడ్డుపై రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి ఆ ట్యాంకు నిండా నీటితో నింపారు. ఈ భారీ బరువును ఆ రేకుల పైకప్పు తట్టుకోలేకపోయింది. నిద్రిస్తున్న వెంకన్న కుటుంబంపై ట్యాంకుతో సహా షెడ్డు పైకప్పు కూలిపోయింది.


నిద్రలోనే విషాదం..


ఈ దారుణ సంఘటనలో వెంకన్న భార్య నాగమణి (32), ముద్దుల కొడుకు విరాట్ కృష్ణ (6) నిద్రలోనే కన్నుమూశారు. వెంకన్నతో పాటు కూతురు నందిని, తల్లి పార్వతమ్మలు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన ముగ్గురిని నార్కెట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, కూతురు నందిని పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది.


తెల్లారితే కొత్త జీవితం, కొత్త ఆశలు ప్రారంభం కావాలి. కానీ.. ఆ కుటుంబానికి కొత్త కేఫ్ శాశ్వత నిద్రకు వేదికైంది. ఆదాయం కోసం ప్రయత్నించిన వ్యాపారం, వారి ప్రాణాలనే బలి తీసుకుంది. బంధువుల కన్నీటి రోదనలు మాడుగులపల్లిలో విషాద ఛాయలను నింపాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa