ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటిలోగా ఒప్పందం కుదుర్చుకోకపోతే.. 155 శాతం సుంకాలు తప్పవు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:31 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్య వేదికపై సుంకాల బెదిరింపుల అస్త్రాన్ని ప్రయోగించారు. రష్యాతో చమురు వ్యాపారానికి సంబంధించి గతంలో భారత్‌కు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్‌.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన చైనాపై కఠిన వైఖరిని ప్రదర్శించారు. నవంబర్ 1వ తేదీలోగా అమెరికాతో ఒక 'న్యాయమైన' వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే.. చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను 155 శాతం వరకు పెంచుతానని స్పష్టం చేస్తూ బీజింగ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే చైనాకు అమెరికాపై అపారమైన గౌరవం ఉందని.. అందుకే అది తమకు ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తున్నదంటూ వ్యాఖ్యానించారు.


సోమవారం రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో కలిసి 8.5 బిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే చైనా అరుదైన ఖనిజాలతో అమెరికాను బెదిరించడానికి ప్రయత్నించిందని.. అయితే తాను సుంకాలతో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టానని తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన సుంకాల పెంపు గురించి ప్రస్తావించారు.


 “చైనా ఇప్పటికే 55 శాతం సుంకాలు చెల్లిస్తుంది. జిన్‌పింగ్‌తో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరకపోతే.. ఆ సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి 155 శాతానికి పెరుగుతాయి” అని ట్రంప్ హెచ్చరించారు. అయితే చైనా కూడా పరస్పర రాయితీలు ఇస్తే సుంకాలను తగ్గించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ అంశంపై చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా చాలా దేశాలు అమెరికాను తమ ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకుంటున్నాయని ట్రంప్ విమర్శించారు. అయితే చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతోందని పేర్కొన్నారు. గతంలో అమెరికాను ఎన్నో దేశాలు దోపిడీ చేశాయని.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని ట్రంప్ పునరుద్ఘాటించారు.


చైనాతో తమకు అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరగలదని తాను ఆశిస్తున్నానని.. అది ఇరు దేశాలకు ముఖ్యంగా ప్రపంచానికి కూడా మంచి చేస్తుందని ఆయన వెల్లడించారు. వ్యక్తిగతంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అలాగేవచ్చే ఏడాది జనవరిలో చైనాలో పర్యటించాలన్న ఆహ్వానాన్ని తాను అంగీకరించానని చెప్పారు. మరో రెండు వారాల్లో దక్షిణ కొరియాలో జరిగే సమావేశంలో జిన్‌పింగ్‌తో భేటీ కానున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.


ఈ నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం (APEC) సదస్సు జరగనుంది. దీనికి ముందుగా అక్టోబర్ 29, 30 తేదీల్లో ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కీలక సమావేశానికి కొద్ది రోజుల ముందు ట్రంప్ ఈ భారీ సుంకాల హెచ్చరిక చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa