టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్నాడు. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్, ఆపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు తనను ఎంపిక చేయకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన షమీ.. తాజాగా తన ఆటతోనూ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. తనను భారత జట్టులోకి తప్పకుండా ఎంపిక చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. రెండు మ్యాచ్లలోనే 15 వికెట్లు తీసి.. ఔరా అనిపించాడు.
ఒకప్పుడు టీమిండియా ఆల్ఫార్మాట్ పేసర్గా ఉన్న షమీ.. గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నప్పటికీ 35 ఏళ్ల షమీని టీమిండియా సెలక్టర్లు పక్కనపెట్టారు. షమీ ఫిట్నెస్, ఫామ్పై అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. అయినా తనను ఎంపిక చేయట్లేదని షమీ ఇటీవల నిరాశ వ్యక్తం చేశాడు. తన ఫిట్నెస్, ఫామ్ను చేతల్లో చూపించేందుకు రంజీ ట్రోఫీని వేదిక చేసుకున్నాడు.
ఉత్తరాఖండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు.. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. తాజాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లోనూ ఇలాంటి ప్రదర్శనే చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా రెండు మ్యాచులలో 15 వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాలు విసిరాడు. షమీ బౌలింగ్తో గుజరాత్ను బెంగాల్ 141 రన్స్ తేడాతో ఓడించింది.
కాగా భారత్తో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్కు రానుంది. నవంబర్ 14 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. ఈ సిరీస్కు షమీ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్లో రాణిస్తే.. వన్డేల్లోనూ అతడు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరి సెలక్టర్లు రంజీ ట్రోఫీలో షమీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa