ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1973 - 2022 వరకు ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలు వీళ్లే

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 10:16 PM

ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్‌ పోరులో టీమిండియా ఉమెన్స్ టీమ్ విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చితే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకంగా మారింది. సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరిన భారత్ నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో తుది పోరులో తలపడనుంది.


ఆ రోజు ట్రోల్ చేశారు.. కానీ ఈరోజు భారత్‌ను గెలిపించింది, ప్రతిరోజూ ఏడ్చాను అంటూ జెమీమా రోడ్రిగ్స్ ఎమోషనల్ స్పీచ్


1973లో ప్రారంభమైన మహిళల వన్డే వరల్డ్‌కప్ ఇప్పటివరకు 12 ఎడిషన్‌లు పూర్తయ్యాయి. 1973 నుంచి 2022 వరకు ఏ ఏ జట్లు విజేతగా నిలిచాయి? ఏ జట్లు రన్నరప్‌తో ముగించాయి అనే పూర్తి విషయాలు మీ అందరి కోసం ఇక్కడ ఇస్తున్నాం. ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేదు. 12 ఎడిషన్‌లు జరిగిన ఈ ట్రోఫీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. 2025తో కలిపి మూడో సారి అడుగుపెట్టినట్టయింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఏడుసార్లు విజేతగా నిలిస్తే, ఇంగ్లండ్ నాలుగు సార్లు టైటిల్‌ను అందుకుంది.


భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా కూడా ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ అందుకోలేదు. నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో ఏ జట్టు గెలిచినా అది చరిత్రే అవుతుంది. సౌతాఫ్రికా జట్టు ఫైనల్ బరిలో నిలవడం కూడా ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాకుండా న్యూజిలాండ్ జట్టు ఒక్కసారి విజేతగా నిలిచింది.


1973 నుంచి 2022 వరకు ట్రోఫీ విజేతలు వీళ్లే


1973లో ఇంగ్లండ్ జట్టు విజేతగా నిలిచి మొట్టమొదటి ట్రోఫీని అందుకోగా ఆస్ట్రేలియా రన్నరప్‌గా నిలిచింది. 1978లో ఆస్ట్రేలియా తొలిసారి టైటిల్‌ను అందుకోగా, ఆ సీజన్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. 1982, 1988లో వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ ఫైనల్‌లో తలపడగా.. ఆస్ట్రేలియా రెండుసార్లు విజేతగా నిలిస్తే, ఇంగ్లండ్ ఓడిపోయింది.


1993లో న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే, ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలయింది. 1997లో కూడా న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2000లో వరుసగా మూడోసారి ఫైనల్‌కి చేరి ఈసారి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.


2005లో భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ బరిలో నిలిచింది. ఆ సీజన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయింది. 2009లో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ తలపడగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. 2013లో ఆస్ట్రేలియా - వెస్టిండీస్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా అవతరించింది. 2017లో భారత్ మళ్లీ రెండోసారి ఫైనల్‌కి చేరి ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. 2022లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ తలపడితే ఆసీస్ ఏడోసారి ట్రోఫీని అందుకుంది.


2025లో భారత్ మూడోసారి ఫైనల్‌కి చేరుకుంది. సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ బరిలో నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్ బరిలో ఎలాగైనా గెలిచి ట్రోఫీ అందుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఫైనల్‌కి వచ్చిన మొదటిసారే గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపోవాలని సఫారీ జట్టు ఎదురుచూస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa