ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల జోరును కొనసాగించాయి

business |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల జోరును కొనసాగించాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో కొనుగోళ్ల ఉత్సాహం వెల్లువెత్తడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా బలమైన ఆర్థిక పరిస్థితులు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 595.19 పాయింట్లు లాభపడి 84,466.51 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180.85 పాయింట్లు పెరిగి 25,875.80 వద్ద ముగిసింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ భారీ గ్యాప్-అప్‌తో 84,238.86 వద్ద ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 84,652.01 వద్ద ఇంట్రా-డే గరిష్ఠాన్ని కూడా తాకింది.అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌కు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం, అక్కడి జాబ్ మార్కెట్ నెమ్మదించడంతో ఫెడ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయి. ఈ కారణాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీని ప్రభావం వర్ధమాన దేశాల మార్కెట్లపై కూడా కనిపించింది" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడం, జీడీపీ వృద్ధి అంచనాలు బలంగా ఉండటం, కంపెనీల ఆర్జనలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు కూడా మార్కెట్లకు మద్దతునిచ్చాయని ఆయన తెలిపారు.సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా అత్యధికంగా లాభపడగా.. టాటా స్టీల్, టాటా మోటార్స్ పీవీ, టాటా మోటార్స్ సీవీ నష్టాలతో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ సూచీ 2.04 శాతం మేర దూసుకెళ్లగా, నిఫ్టీ ఆటో 1.24 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.23 శాతం చొప్పున లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 0.8 శాతం వరకు లాభాలతో ముగియడం మార్కెట్‌లో సానుకూలతకు అద్దం పట్టింది.మరోవైపు, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 6 పైసలు బలహీనపడి 88.62 వద్ద ముగిసింది. కీలకమైన ఆర్థిక గణాంకాల కోసం ట్రేడర్లు వేచిచూస్తుండటంతో రూపాయి పరిమిత శ్రేణిలో కదలాడింది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 99.60 వద్ద స్థిరంగా ఉందని, ఈ వారం విడుదల కానున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు డాలర్, రూపాయి కదలికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో రూపాయి 88.40–88.85 శ్రేణిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa