ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తప్పయిపోయింది క్షమించండి.. నష్టపరిహారం చెల్లించలేం': ట్రంప్‌నకు బీబీసీ లేఖ

international |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 08:57 PM

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన మీడియా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ).. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను తప్పుదోవ పట్టించే విధంగా ఎడిట్ చేసినందుకు బీబీసీ మరోసారి ట్రంప్‌నకు క్షమాపణ చెప్పింది. కానీ ట్రంప్ తరపు న్యాయవాదులు డిమాండ్ చేసిన 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.8,300 కోట్లు) భారీ పరిహారాన్ని చెల్లించడానికి మాత్రం నిరాకరించింది.


ట్రంప్ తరపు న్యాయవాదులు ఇటీవల బీబీసీకి లేఖ రాస్తూ.. ఆ వివాదాస్పద డాక్యుమెంటరీని ఉపసంహరించుకోవడంతో పాటు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ క్లయింట్‌కు జరిగిన నష్టానికి బిలియన్ డాలర్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో బీబీసీ సంస్థ వెనక్కి తగ్గింది.


 అసలేం జరిగిందంటే..?


వివాదం 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ చేసిన ప్రసంగానికి సంబంధించినది. ఈ ప్రసంగాన్ని బీబీసీ తన పనోరమా కరెంట్ అఫైర్స్ సిరీస్‌లో ప్రసారం చేసింది. అయితే అందులో ట్రంప్ ఆందోళనకారులను శాంతియుతంగా పోరాడాలని చెప్పినప్పటికీ.. "క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం" అని చెప్పినట్లుగా బీబీసీ చూపించింది. దీంతో ట్రంప్ బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ లేఖ రాశారు. అలాగే సదరు డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పారు.


ఈ పరిణామాల నేపథ్యంలోనే బీబీసీ చైర్మన్ సమీర్ షా స్వయంగా వైట్‌హౌస్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తమ సంస్థతో పాటు తాను కూడా క్షమాపణలు చెబుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరించారు. అంతేకాక ఈ వివాదాస్పద డాక్యుమెంటరీని భవిష్యత్తులో మళ్లీ తమ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీబీసీ స్పష్టం చేసింది. అయితే తమ ప్రోగ్రామ్‌తో ట్రంప్ పేరు ప్ర‌ఖ్యాత‌ల‌కు న‌ష్టం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని బీబీసీ పేర్కొంది. అలాగే ట్రంప్ దాఖలు చేసిన భారీ నష్టపరిహారం దావాను తోసిపుచ్చింది.


"వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసిన విధానం పట్ల బీబీసీ చింతిస్తున్నప్పటికీ.. ఇది పరువు నష్టం దావాకు దారి తీస్తుందనే వాదనను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము" అని బీబీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతర్గతంగా వచ్చిన నిష్పాక్షికత ఆరోపణల కారణంగా బీబీసీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉన్నత వ్యక్తులు ఇటీవల రాజీనామా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa