ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్,,,,డ్రాగన్ దేశానికి నేపాల్ కాంట్రాక్టు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:06 PM

భారత్ పొరుగు దేశం నేపాల్.. తమ కరెన్సీ నోట్లను చైనాలో ప్రింట్ చేయించుకుంటోంది. ఈ మేరకు నేపాల్ సెంట్రల్ బ్యాంకు అయిన.. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ .. శుక్రవారం (నవంబర్ 13) చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నేపాల్ 1,000 రూపాయల నోట్లను CBPMC ప్రింట్ చేయనుంది. మొత్తం 430 మిలియన్ల నోట్లను డిజైన్ చేసి, ముద్రించి, సరఫరా చేయడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 16.985 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఈ పని చేయడానికి అత్యంత తక్కువ ధరకు చైనా టెండర్ వేసింది.


  కాగా, గతంలో నేపాల్ కరెన్సీ నోట్లు భారత్‌‌లోనే ప్రింట్ అయ్యేవి, 1945 నుంచి 1955 వరకు నేపాల్ కరెన్సీ నోట్లు నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌లో తయారయ్యేవి. 2015 వరకు నేపాల్‌కు సంబంధించిన కొన్ని రకాల నోట్ల ప్రింటింగ్‌ను ఇండియా హ్యాండిల్ చేసింది. ఆ తర్వాత నుంచి నేపాల్.. తమ నోట్ ప్రింటింగ్ కాంట్రాక్టులు చైనాకు అప్పగించింది. అయితే భారత్‌ను కాదని చైనాకు అప్పగించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి.


భారత్‌ను కాదనడానికి కారణాలేంటి?


గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ.. చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్.. నేపాల్ నోట్లను వరుసగా ఏడు సార్లు ముద్రించడానికి బిడ్లను గెలుచుకుంది. ఈ సమయంలో దాదాపు 2.38 బిలియన్ నోట్ల ముద్రణ కోసం ఈ కంపెనీ.. నేపాల్ నుంచి దాదాపు 63 మిలియన్ డాలర్లను ఆర్జించింది. భారత్‌తో పోల్చితే చైనాలో తక్కువ ధరలో ప్రింటింగ్ అవుతోంది. అయితే నేపాల్.. భారత్‌ నుంచి చైనాకు నోట్ల ప్రింటింగ్ షిప్ట్ చేయడానికి ఖర్చు మాత్రమే కారణం కాదు. నేపాల్ కొత్త కరెన్సీ నోట్లలో లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ వంటి వివాదాస్పద ప్రాంతాలు ఆ దేశంలో భాగంగా ముద్రించింది. ఇక ఈ నోట్లను భారత్ ముద్రిస్తే.. రాజకీయంగా సున్నితమైన సమస్య అవుతుంది. దీంతో పాటు చైనా ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా అందిస్తుండటం వల్ల నేపాల్.. భారత్‌ను కాదని చైనాను ఎంచుకుంది. ప్రస్తుతం నేపాల్ అన్ని నోట్లు చైనాలో ముద్రిస్తున్నారు.


కాగా, ఇలా చైనా వద్ద తమ కరెన్సీని ముద్రించకుంటున్నది నేపాల్ ఒక్కటే కాదు. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, ఆఫ్గానిస్తాన్ వంటి ఇతర దక్షిణాసియా దేశాలు కూడా చైనాలోనే తమ డబ్బును ముద్రించుకుంటున్నాయి. ఇక చైనాలో ఉన్న బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డబ్బును ప్రింటింగ్ చేసే సంస్థ. చైనా CBPMC కాకుండా.. జపాన్‌లోని నేషనల్ ప్రింటింగ్ బ్యూరో (NPB), రష్యా గోజ్నాక్, అమెరికాలోని బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ కరెన్సీ వంటి సంస్థలు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న కరెన్సీ ముద్రణతో పాటు హై-సెక్యురిటీ డాక్యుమెంట్లను ప్రింట్ చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa