ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి భారీగా పెట్టుబడులు.... లక్షల్లో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:23 PM

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15వ తేదీలలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ.. పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఒప్పందాలు చేసుకుంది. 40 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఏపీకి రూ.3,49,476 కోట్ల పెట్టుబడులను రాబట్టడమే ధ్యేయంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 4,15,890 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు.


మరోవైపు సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందే ఏపీ ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. గురువారం ఒక్క రోజే 35 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.3,65,304 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 1,26,471 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. శుక్రవారం 40 సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ రెండు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం 75 ఎంవోయూలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5,42,361 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.


మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. భూములు, కరెంట్ వంటి విషయాల్లో రాయితీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్‌ చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు.


ఈ ప్రోత్సాహకాలకు సావనీర్‌ గ్యారంటీ కూడా ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే ఏపీకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రంగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటుచేసి.. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa