ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. బోనస్ 75 శాతం.... నవంబర్ జీతంతోనే!

business |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 10:24 PM

భారత దిగ్గజ ఐటీ కంపెనీలు కొంత కాలంగా బలహీన ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా అంతంతమాత్రంగానే ఫలితాల్ని నమోదు చేశాయి. అయితే వీటిల్లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రం అదరగొట్టింది. మిగతా వాటి కంటే కాస్త మెరుగైన ఫలితాల్నే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా తమ అర్హులైన ఉద్యోగులకు వేరియబుల్ పే (బోనస్) పై ప్రకటన చేసింది. అర్హులైన ఉద్యోగులకు జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి బోనస్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం రోజు కంపెనీ తమ ఉద్యోగులకు.. పెర్ఫామెన్స్ బోనస్ లెటర్స్ జారీ చేసింది. చాలా వరకు సగటున 75 శాతం వేరియబుల్ పే అందనున్నట్లు తెలిపింది.


ఇన్ఫోసిస్ కంపెనీలో 3,23,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఉద్యోగ స్థాయిల్ని బట్టి బోనస్ పంపిణీలో వేర్వేరుగా ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల (జాబ్ లెవెల్- 4) విషయానికి వస్తే.. ఈ స్థాయి ఉద్యోగులకు సగటు 83 శాతం బోనస్ దక్కింది. ఇంకా అవుట్‌స్టాండింగ్ పెర్ఫామెన్స్ (అద్భుతమైన పనితీరు) కనబరిచిన వారికి 83 శాతం బోనస్ ఇవ్వనుంది. ప్రశంసనీయమైన పనితీరు (కమెండబుల్ పెర్ఫామెన్స్) కనబర్చిన వారికి సగటున 78.5 శాతం, అంచనాల్ని అందుకున్న వారికి (మెట్ ఎక్స్పేక్టేషన్స్) 75 శాతం వేరియబుల్ పే అందనుంది.


ఇంకా తక్కువ లెవెల్ ఉద్యోగులకు కనీసం 70.5 శాతం నుంచి గరిష్టంగా 83 శాతం మధ్య ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ నుంచి టీమ్ లీడర్స్, సీనియర్ మేనేజర్ల వరకు (జాబ్ లెవెల్ 4,5,6) ఉన్న మెజార్టీ ఉద్యోగులకు ఈ బోనస్ దక్కింది. ఇన్ఫీ.. తమ ఉద్యోగులకు పంపిన సమాచారంలో.. ఈ బోనస్‌ను నవంబర్ జీతంతో పాటే అందించనున్నట్లు తెలిపింది. అయితే గత సారితో పోలిస్తే ఈసారి బోనస్ 5-7 శాతం వరకు తక్కువగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. జూన్ త్రైమాసికంలో సగటు బోనస్ చెల్లింపు 80 శాతంగా ఉంది.


కంపెనీ త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ జులై- సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ. 7,364 కోట్ల మేర నికర లాభం ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం 13 శాతం పెరిగింది. ఆదాయ వృద్ధి అంచనాల్ని కూడా 1-3 శాతం నుంచి 2-3 శాతానికి పెంచింది. అంతకుముందు ఫిబ్రవరిలో వేతన పెంపు కూడా అమలు చేసింది. చాలా వరకు 5-8 శాతం వరకు శాలరీలు పెంచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa