ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరుచుకున్న శబరిమల.. రేపటి నుంచి దర్శనాలు

national |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 07:38 PM

కేరళలోని శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల- మకర విళక్కు పూజల కోసం నవంబరు 16న ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. ప్రధాన పూజారి కందరార్ మహేశ్ మోహనార్ సమక్షంలో మేల్‌సంతి అరుణ్‌ కుమార్ నంబూద్రీ ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరిచారు. సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి 18 మెట్లు మీదుగా దిగి, సన్నిధానం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో అధీని (పవిత్ర గుండం) వెలిగించారు. అనంతరం పడిమెట్ల వద్ద వేచి ఉన్న పూజారుల చేతులను పట్టుకుని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. ఆలయాన్ని తెరిచినప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు, కొత్తగా నియమితులైన పూజారులు తలుపులు తెరవడంతో యాత్రా సీజన్ మొదలవుతుంది. రేపు ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.


ఉదయం 6.30 గంటలకు తంత్రి శబరిమల అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి వద్ద మెల్‌సంతి అభిషేకం చేసి ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత మాలికప్పురం ఆలయంలో ప్రతిష్ఠాపన జరుగుతుంది. రోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. డిసెంబరు 2 వరకు వర్చువల్ క్యూ టిక్కెట్ బుకింగ్ తెరిచే ఉంటుంది. రోజుకు 70 వేల వర్చువల్ క్యూ టోకెన్లు, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 టోకెన్లు జారీచేస్తారు. రోజుకు 90 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు పంపాలో ఒకేసారి పదివేల మందికి వసతి కల్పించే పది వాకింగ్ పెవిలియన్లు, ఒక జర్మన్ పెవిలియన్ ఉన్నాయి.


పంపా, నిలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం, చెంగన్నూర్లలో స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు టీడీబీ తెలిపింది. గణపతి హోమం, అష్టాభిషేకం, నెయ్యాభిషేకం, ఉదయం పూజ, సాయంకాల పూజ, నిత్య పూజ, పుష్పాభిషేకం కోసం ఆన్లైన్ బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే, ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్లు రద్దు చేసుకుంటే, వాటిని లైవ్ బుకింగ్‌‌గా మారుస్తారు. ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ నవంబరు 1న ప్రారభం కాగా.. ఇప్పటి వరకూ 22 లక్షల మందికిపైగా భక్తులు బుక్ చేసుకున్నారు.


నవంబరు 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. మకరు విళక్కు పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.


ఇక, ఈ ఏడాది భక్తులు మరింత పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండటంతో టీడీబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. సన్నిధానంలో ముఖ్యంగా పదునెట్టాంబడి వద్ద మొబైల్ ఫోన్లు వినియోగంపై నిషేధం విధించింది. ఆలయ పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు తీసినా చర్యలు తీసుకుంటారు. అలాగే, ఎరుమేలి, నిలక్కల్‌లో ఒకేసారి 14 వేల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్ ఏర్పాటుచేశారు. మాస పూజలకు చిన్న వాహనాలను పంపా వద్ద పార్కింగ్‌కు అనుమతించేవారు. ప్రస్తుతం మొత్తం 2,000 వాహనాలను నిలిపే ఏర్పాట్లు ఉన్నాయి. యాత్రా మార్గం అంతటా భద్రతను గణనీయంగా పెంచారు. మొత్తం 18,741 మంది పోలీసు సిబ్బందిని నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa