ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐఐ భాగస్వామ్య సదస్సులో వేదిక మీద పారిశ్రామికవేత్తలెక్కడ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 01:43 PM

వైజాగ్‌ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఒట్టి బూటకమని వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైజాగ్‌ సమ్మిట్‌లో వేదిక మీద మంత్రుల తప్ప పారిశ్రామికవేత్తలెవరూ కనిపించలేదని గుర్తు చేశారు. 2023లో అదే విశాఖలో నిర్వహించిన జీఐఎస్‌లో నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్‌ అంబానీ, కరణ్‌ ఆదానీ, దాల్మియా, నవీన్‌ జిందాల్, సంజయ్‌ బంగర్, భజంకా తదితరులు ఒకే వేదికపై కూర్చున్నారని చెప్పారు. అప్పటి, ఇప్పటి రెండు వేదికలను చూస్తే ఎవరు పారిశ్రామిక వేత్తలను బెదిరించారో తెలుస్తుందని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్న చంద్రబాబు కేవలం క్రెడిట్‌ చోరీ మాత్రమే కాదని.. విజన్‌ చోరీ కూడా అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. నాలుగు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని.. వైయస్‌.జగన్‌ హయాంలో ప్రతి 50 కిలోమీటర్లకు షిషింగ్‌ హార్భర్‌ లేదా పోర్టు నిర్మాణం ప్రారంభిస్తే.. అది కూడా తన ఆలోచన అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సముద్ర తీరంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వైయస్‌.జగన్‌ విజన్‌ అయితే.. బికినీ ఫెస్టివల్స్‌ పేరుతో జల్సాలు చంద్రబాబు ప్రభుత్వ విజన్‌ అని మండిపడ్డారు.  స్టీల్‌ ప్లాంట్‌ పై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అమర్నాధ్‌... రాష్రంలో అతిపెద్ద పరిశ్రమను కాపాడలేక, ఉద్యోగులను నిందిస్తున్న కూటమి ప్రభుత్వం.. రానున్న రెండేళ్లలో  ఏ విధంగా 40 లక్షల ఉద్యోగాలిస్తుందని నిలదీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa