బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్థాపించిన జన సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కానీ, తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఏకంగా 3.4 శాతం ఓట్ షేర్ను సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సీట్ల పరంగా విఫలమైనా, ఓట్ల పరంగా బలమైన అరంగేట్రం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జన సురాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 238 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం మీద 16.77 లక్షలకు పైగా ఓట్లను సాధించింది. ఆశ్చర్యకరంగా, పార్టీ పోటీ చేసిన వాటిలో 129 నియోజకవర్గాల్లో, అంటే సగానికి పైగా సీట్లలో మూడో స్థానంలో నిలిచింది. సరన్ జిల్లాలోని మర్హౌరా స్థానంలో రెండో స్థానం దక్కించుకుంది. అనేక నియోజకవర్గాల్లో ఎన్డీఏ, మహాఘట్బంధన్ కూటముల అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే జన సురాజ్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. ఉదాహరణకు, చన్పాటియాలో యూట్యూబర్ మనీశ్ కశ్యప్కు వచ్చిన 37,000 ఓట్లు బీజేపీ ఓటమికి కారణమయ్యాయి.బీహార్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన బీఎస్పీ (1.62 శాతం), ఎంఐఎం (1.85 శాతం), వామపక్ష పార్టీలు సంయుక్తంగా సాధించిన ఓట్ల కంటే కూడా జన సురాజ్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం దాని ప్రభావానికి అద్దం పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa