నేరం చేసి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు చాలా మంది. అందుకోసం అనేక మార్గాలు అనుసరిస్తారు. ఏమాత్రం అనుమానం రాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో ప్రణాళికలు వేస్తారు. ఈ సమయంలో ఎదో ఒక తప్పిదం చేసి.. పోలీసులు చిక్కుతారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తర్ప్రేదశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగింది. ఓ మహిళ.. తాను పిచ్చిదాన్ని.. తన భర్త నిర్దోషి అని రక్తంతో మరణ వాంగ్మూలం రాసి చనిపోయినట్లు పోలీసులకు సమాాచారం. ఘటనా స్థలికి చేరుకున్ని పోలీసులు కూడా మహిళ ఆత్మహత్య చేసుకుందని భావించి.. దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే వారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఒక చిన్న అనుమానంతో నిందితుడి మాస్టర్ ప్లాన్ బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేసే రోహిత్ (35), సుష్మా ద్వివేది (32) ప్రయాగ్రాజ్లో నివసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వీళ్లకు వివాహం అయింది. అయితే సుష్మాతో పిల్లల్ని కనడం రోహిత్కు ఇష్టం లేదు. 'మీ వదిన పిల్లలు ఉన్నారు.. వారినే చూసుకుందాం.. పిల్లలు వద్దూ' అనేవాడు రోహిత్. ఈ విషయంపై ఇద్దరికీ చాలా సార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రోహిత్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని సుష్మా తరచూ గొడవ పెట్టుకునేది. ఈ విషయమై ఇటీవల భార్యా భర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.
ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 14) భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు రోహిత్. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. రక్తంతో ఫ్లోర్పై మరణ వాంగ్మూలం రాశాడు. పోలీసులను తప్పుదారి పట్టించడానికి "నేను పిచ్చిదాన్ని.. నా భర్త నిర్దోషి" అని రాశాడు. ఆమె చేతులకు రక్తం అంటించి ఆత్మహత్యలా చిత్రీకరించాడు. అనంతరం ఆఫీస్కు వెళ్లిపోయి.. ఇంటి ఓనర్కు ఫోన్ చేశాడు. తన భార్య కాల్ లిఫ్ట్ చేయడం లేదని.. ఓసారి వెళ్లి చూడాల్సిందిగా కోరాడు. ఇంటి ఓనర్ వెళ్లి చూడగా.. సుష్మా రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి.. ఫ్లోర్పై మరణ వాంగ్మూలం కనిపించింది. సుష్మా ఆత్మహత్య చేసుకుంది కావచ్చు.. అని పోలీసులు మొదట భావించారు. కానీ క్రైమ్ సీన్లో కొన్ని తేడాలు గమనించగా.. అనుమానాలు మొదలయ్యాయి.
అలా దొరికిపోయాడు..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఓ చిన్న అనుమానం వచ్చింది. మృతురాలి చేతిలో ఉన్న రక్తం.. మరణ వాంగ్మూలం రాయడానికి సరిపోదు. మరి ఆమె ఎలా రాసి ఉంటుంది అనే అనుమానం వచ్చింది. అనంతరం రోహిత్ను తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే తన భార్యను చంపానని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa