ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం స్టాలిన్‌, అజిత్, అరవింద్ స్వామీ, ఖుష్బూల ఇళ్లకు బాంబు బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 08:45 PM

తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో సహా పలువురు అగ్రశ్రేణి సినీ ప్రముఖులకు వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు, భద్రతా సిబ్బంది ఆయా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల వద్ద తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాసంతో పాటు, ప్రముఖ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, నటి ఖుష్బూ నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్ నేరుగా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.


బూటకపు బెదిరింపులుగా నిర్ధారణ


సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ముఖ్యమంత్రి నివాసంతో సహా నటుల ఇళ్ల వద్ద గంటల తరబడి తనిఖీలు జరిగాయి. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులు బూటకమైనవిగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.


గత కొద్ది రోజులుగా తమిళనాడులోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, టీవీకే చీఫ్‌ విజయ్‌, నటులు త్రిష, నయనతార, రజినీకాంత్, ధనుష్, ప్రభు వంటి సినీ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. కేవలం సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి, బీజేపీ ప్రధాన కార్యాలయానికి, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోస్‌కు, డీజీపీ ఆఫీసు, రాజ్‌భవన్‌లకు కూడా ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, సింగపూర్ వంటి విదేశీ కార్యాలయాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు.


ఈ బెదిరింపులన్నీ నకిలీవిగా తేలినప్పటికీ.. పోలీసులు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ప్రతి బెదిరింపును సీరియస్‌గా పరిగణిస్తూ ఆయా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ఈ తరహా వరుస బెదిరింపుల వెనుక ఉన్న అసలు కారణాలను, సూత్రధారులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa