ఉద్యోగులకు కంపెనీ జారీ చేసిన ల్యాప్టాప్లు, పీసీలలో వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నూతన పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఐటీ రంగంలో ఉద్యోగి పనితీరుపై నిత్యం నిఘా ఉంటుందనే విషయం తెలిసిందే. కాగ్నిజెంట్ ఇప్పుడు ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఈ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకువచ్చింది.కంపెనీ జారీ చేసిన ల్యాప్టాప్లు, పీసీల ద్వారా ఉద్యోగుల పనితీరును ట్రాక్ చేస్తోంది. ఇందుకోసం 'ప్రోహాన్స్' వంటి వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సాధనాలను వినియోగిస్తోంది. ఉద్యోగులు ఉపయోగించే కీబోర్డు, మౌస్ల ద్వారా ట్రాక్ చేస్తోంది. ఈ తరహా ట్రాకింగ్పై విమర్శలు వస్తున్నాయి.ఉద్యోగి పని చేయకుండా ఖాళీగా ఉన్న సమయాన్ని ప్రోహాన్స్ వంటి టూల్ ట్రాక్ చేస్తుంది. మౌస్ లేదా కీబోర్డు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్-యాక్టివ్గా ఉంటే ఆ ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు పరిగణిస్తారు. అదే 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్-యాక్టివ్గా ఉంటే వేరే పనిలో నిమగ్నమైనట్లు పరిగణిస్తారు. ఈ మానిటరింగ్ వ్యవస్థ ఒక్కో టీమ్కు ఒక్కో విధంగా ఉంటుందని కథనాలు వెలువడ్డాయి.ఈ ట్రాకింగ్ వ్యవస్థపై విమర్శలు వస్తుండటంతో కంపెనీ స్పందించింది. ఈ ట్రాకింగ్ను ఉద్యోగి పనితీరుకు ముడిపెట్టబోమని స్పష్టం చేసింది. ప్రమోషన్లు, బోనస్ వంటి అంశాల్లో ఈ డేటాను ఉపయోగించబోమని వెల్లడించింది. ఇతర సంస్థల మాదిరిగానే ఉత్పాదకతను పెంచే టూల్స్ను మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa