సౌదీ అరేబియాలో మక్కా-మదీనా మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సు, డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అయితే వారి మృతదేహాలు.. స్వస్థలాలకు రావడానికి అక్కడి చట్టాలు అడ్డంకిగా మారాయి. ఉమ్రా యాత్రికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. సౌదీ అరేబియాలో హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మతపరమైన యాత్ర సమయంలో (మక్కా, మదీనా లేదా సౌదీ అరేబియాలో ఎక్కడైనా) యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని వారి స్వదేశానికి పంపడానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ నియమం అనేక ఏళ్లుగా అమలులో ఉంది. అయితే హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది.
అయితే మక్కా, మదీనా వంటి తీర్థయాత్రలకు వెళ్లే ముందు యాత్రికులు నింపే అధికారిక ఫారంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ ఈ యాత్ర సమయంలో యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి అంగీకరిస్తూ ఆ ఫారంలో వారు సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే.. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భారత్కు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హజ్ యాత్ర సమయంలో యాత్రికులు విమానంలో, రైలు, రోడ్డు ప్రమాదంలో మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి వారు, వారి కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు ఆ దరఖాస్తు ఫారమ్లో స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాలు అప్పగించాలని.. అభ్యంతరం తెలిపినా యాత్రికులు ముందే అనుమతి ఇచ్చినందున.. వారి మృతదేహాలను వెనక్కి పంపించడం చట్టపరంగా సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
నష్టపరిహారంపై నిబంధన
సౌదీ హజ్ చట్టం ప్రకారం.. హజ్, ఉమ్రా మతపరమైన యాత్రలు కాబట్టి.. వాటికి ప్రభుత్వం పరంగా ఎలాంటి బీమా ఆధారిత సౌకర్యాలు ఉండవు. హజ్ యాత్ర సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. హజ్ యాత్రికులు భారత్లో ప్రైవేట్ బీమా తీసుకుని ఉంటే.. వారి పాలసీ ప్రకారం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే.. ఈ ప్రక్రియను సౌదీ అరేబియా ప్రభుత్వం కాకుండా.. సంబంధిత యాత్రికుడి దేశం, వారి బీమా సంస్థ ద్వారా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ విషాదకర ఘటనలో 45 మంది హైదరాబాద్ వాసులు చనిపోయారు. వీరిలో 20 మంది మహిళలు.. 11 మంది పిల్లలు ఉన్నారు. మక్కాలో పవిత్ర ఉమ్రా పూర్తి చేసుకున్న వీరంతా.. అక్కడి నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం.. ఈ 45 మంది మృతదేహాలను బహుశా స్వదేశానికి తీసుకురాలేక.. అక్కడే ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa