రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి అగ్రరాజ్యం అమెరికా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవేవీ ఫలించకపోవడంతో.. మాస్కోను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయానికి మద్దతు తెలిపారు. ముఖ్యంగా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై.. ఇప్పటికే భారీ శాతం సుంకాలను విధించారు. ఇప్పుడు వాటిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం వరకు భారీ సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన ఒక కొత్త బిల్లుకు తాను మద్దతు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
500 శాతం సుంకాల బెదిరింపు..
రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు ట్రంప్ ఆమోదం లభిస్తే.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ట్రంప్ పేర్కొన్న ఈ దేశాల జాబితాలో భారత్, చైనా వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన దేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ జాబితాలో ఇరాన్ను కూడా చేర్చనున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు.
ముఖ్యంగా భారత్, చైనాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, ఇతర వనరులను కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా సహకరిస్తున్నాయని ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ఆర్థిక సహకారం వల్లే మాస్కో కీవ్పై దాడులు కొనసాగించడానికి వీలు అవుతుందని పేర్కొంటూ.. గతంలోనే భారత్పై 50 శాతం విధించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 500 శాతం సుంకాల బిల్లు అమలులోకి వస్తే.. ఇది భారత్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. రష్యా నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకునే అనేక భారతీయ కంపెనీలు.. ఖర్చుల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది అంతిమంగా వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుంది.
ఈ సుంకాల పెంపు కేవలం వాణిజ్యపరమైన నిర్ణయం కాదని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాని ఆపడానికి ఒక ఆయుధంగా పని చేస్తుందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీసి.. ఆ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం అని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అమెరికా తన రాజకీయ లక్ష్యాల కోసం ఈ కఠినమైన నిర్ణయాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa